అమరావతినే రాజధానిగా పేర్కొంటూ కేంద్రం నిధులు

అమరావతినే రాజధానిగా పేర్కొంటూ కేంద్రం నిధులు
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దొంగాట ఆడుతుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ దృష్టిలో అమరావతి మాత్రమే అని పలు సందర్భాలలో స్పష్టం చేస్తూ వస్తున్నది. తాజాగా బడ్జెట్ లో నిధులు కూడా రాజధాని పేరుతో విడుదల చేయడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. 
అమరావతినే ఎపి రాజధానిగా పేర్కొంటూ 2022-23 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించింది. కేంద్రబడ్జెట్‌లో పట్టణాభివృద్ధిశాఖ నుంచి అమరావతిలో సచివాలయం, ఉద్యోగులు ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ప్రొవిజన్‌ తీసుకొచ్చింది.
సచివాలయ నిర్మాణానికి రూ.1,214కోట్లు, ఉద్యోగుల నివాస గృహాల కోసం రూ.1,126కోట్లు అంచనా వ్యయంగా ప్రొవిజన్‌లో కేంద్రం పేర్కొంది. జీపీవోఏకి భూసేకరణ వ్యయం రూ.6.69 కోట్లుగా కేంద్రం అంచనా వేసింది.
2021-22 బడ్జెట్‌లో ఉద్యోగుల నివాస గృహాల భూసేకరణ వ్యయం రూ.21కోట్లుగా అంచనా వేసిన కేంద్రం అందులో రూ.18.30 కోట్లు ఖర్చు చేసింది. 300 ఏజీ స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మాణ వ్యయాన్ని రూ.200కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్‌లో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.