జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి) మాతృభాష వినియోగం ప్రాధాన్యతను స్పష్టం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రాంతీయ భాషల్లో కూడా ప్రొఫెషనల్ కోర్సులను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రపంచంలోని పురాతన భాష తమిళం భారతదేశంలో ఉందని ప్రతి పౌరుడు గర్వపడాలని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాతృభాష, అమ్మ రెండూ జీవితపు పునాదిని పటిష్టపరుస్తాయని చెప్పారు. 121 రకాల మాతృభాషలతో ముడిపడి ఉండటం దేశం గర్వించదగ్గ విషయమని, వాటిలో 14 నిత్య జీవితంలో కోటి మందికి పైగా మాట్లాడే భాషలని ప్రధాని తెలిపారు. 2019లో ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ మూడో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
ప్రజలు సగర్వంగా తమ మాతృభాషల్లోనే మాట్లాడుకోవాలని ప్రధాని మోదీ కోరారు. భాషల సంపన్నతలో మనకు సాటి మరెవరూ లేరన్నారు. ప్రజాదరణ పొందిన పలు భారతీయ గీతాలను వివిధ భాషల్లో వీడియోలుగా రూపొందించి, వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చి, దేశ భిన్నత్వాన్ని కొత్త తరానికి పరిచయం చేయాలని ప్రధాని యువతకు పిలుపునిచ్చారు.
జాతీయ గీతం సహా పలు భారతీయ గీతాలకు అనుగుణంగా పెదాలు కదుపుతూ(లిప్ సింకింగ్) తయారు చేసిన వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న టాంజానియాకు చెందిన కవలలు కిలి పౌల్, నీమాలను ఆయన ఉదహరించారు.
బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, టాంజానియా మాజీ ప్రధాని ఒడింగా కూతురు రోజ్మేరీ వంటి వారు మన ఆయుర్వేద విధానం పట్ల మక్కువ పెంచుకున్నారని ప్రధాని గుర్తు చేశారు. అయితే, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన తర్వాత కూడా చాలా మంది దేశవాసుల్లో ఇప్పటికీ వేషభాషలు, ఆహార పానీయాలకు సంబంధించి అపోహలు, అభ్యంతరాలు ఉన్నాయని మోదీ విచారం వ్యక్తం చేశారు.
దేశంలో ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు ఆయుష్ శాఖను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ప్రధాని మోదీ పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పించేందుకు, వివిధ రంగాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు పురుషులతో సమానంగా మహిళల వివాహ వయస్సును పెంచినట్లు చెప్పారు.
ట్రిపుల్ తలాక్ వంటి సామాజిక దురాచారాలనూ రూపుమాపామని పేకరోన్తు ట్రిపుల్ తలాక్పై చట్టం తీసుకువచ్చాక దేశంలో ట్రిపుల్ తలాక్ కేసుల్లో 80 శాతం తగ్గుదల కనిపించిందని ప్రధాని తెలిపారు. మార్పు కోరుతూ మహిళలు ముందుకు రావడమే ఈ పరిణామానికి కారణమైందని చెప్పారు.
అస్సాంలోని కోక్రాఝర్, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం, రాజస్తాన్లోని సవాయ్ మాధోపూర్, జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లలో పర్యావరణ పరిరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు జరుగుతున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు.
బీహార్లోని గయలోని ఆలయం నుండి దొంగిలించబడిన వెయ్యి సంవత్సరాల నాటి అవలోకితేశ్వర పద్మపాణి విగ్రహాన్ని ఇటలీ నుండి భారతదేశానికి తిరిగి తీసుకొచ్చామని చెప్పారు. 2013 వరకు, దాదాపు 13 విగ్రహాలను తిరిగి తీసుకొచ్చారని తెలిపారు. అయితే గత ఏడేళ్లలో మనదేశానికి 200 కంటే ఎక్కువ విగ్రహాలను తిరిగి తీసుకొచ్చామని వివరించారు.
More Stories
ఢిల్లీ పోలీసులను 4 వారల గడువు కోరిన రేవంత్ రెడ్డి
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. ఒకే గూటి పక్షులు