* జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా
వైజ్ఞానిక రంగంలో తొలి నొబెల్ అందుకున్న కాంతి పుంజం. ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారాడు ఈ విజ్ఞాన యోధుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింప జేసిన వ్యక్తిల్లో సర్ సీవి రామన్ మొదటివారు.
నవంబర్ 7, 1888 తమిళనాడులోని తిరుచురాపల్లిలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. తండ్రి విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేయడం వల్ల రామన్ బాల్యం, విద్యాభ్యాసం అక్కడే జరిగింది.
బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ ను కలిసి పరిశోధనలకు అనుమతిని పొందారు. నాటి నుంచి మొదలైన ఆయన పరిశోధనలు నిరంతరం కొనసాగాయి.
రామన్ తల్లి పార్వతి అమ్మాళ్ వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం లాంటి సంగీత వాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన పరిశోధన తృష్ణ వల్ల తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు.
1921 లో లండన్లో తాను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడు కావాలనుకుంటున్నావా? ఏంటి అని ఓ వ్యక్తి వెటకారంగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత పట్టుదల పెరిగింది.
సముద్రం నీరు నీలి రంగులో ఎందుకు ఉంటుంది? ఈ అంశంపై సీ. వి. రామన్ చేసిన ప్రయోగం ఓ సంచలనం. అనేక అద్భుతాలకు వేదికగా నిలిచింది. ఈ అంశంపై ఎన్నో పరిశోధనలు ఆయన చేశారు. ఈ ప్రయోగాలే ఆయనను నోబెల్ చెంతన నిలబెట్టాయి. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మళ్లాయి. ఇంగ్లాండు నుంచి తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపజేసింది.
అప్పటిదాకా అందరూ అనుకుంటున్నట్లు సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశ వర్ణం సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు అది పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించారు. తన పరికల్పలను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘన పదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు.
ఇందులో భాగంగా చేసిన రామన్ ఎఫెక్ట్స్కే 1930లో నోబెల్ బహుమతి లభించింది. భారత ప్రభుత్వం కూడా ప్రథమ జాతీయ ఆచార్యునిగా నియమించి.. 1954 లో ‘భారతరత్న’ బిరుదు ఇచ్చింది. 1957 లో సోవియట్ యూనియన్ ‘లెనిన్ బహుమతి’తో సత్కరించింది.
భారతరత్న అందుకున్న సమయంలో రామన్ చేసిన ప్రసంగం నేటి యువతకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు.. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి అంటూ రామన్ చేసిన ప్రసంగం నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.
ఉదయాకాశంలోని వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు వీటిని చూస్తూ ఉంటే స్పటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి.. అందుకే “విజ్ఞానం అత్యుత్తమైన సృజనాత్మక కళారూపం అని రామన్ ఎప్పుడూ చెబుతుండే వారు.
రామన్ జీవితంలో మరో మైలురాయి రామన్ ఎపెక్ట్ సిద్దాంతం.. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని.. దానివల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని తన సిద్దాంతాల ద్వారా రుజువు చేశారు రామన్. అప్పటికున్న అరకొర సదుపాయాలతోనే మన దేశ విజ్ఞాన కిరణాలను నలుదిశలా ప్రసరింపజేశారు.
అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టును ఆవిష్కరించారు. ఈ పరిశోధనను అభినందిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం 1929 లో నైట్ హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో రూ.200 కూడా ఖర్చుచేయని పరికరాలతో ఆ విషయ నిరూపణ జరగడం అద్భుతమని ప్రపంచ శాస్త్రజ్ఞులంతా రామన్ను అభినందించారు.
అత్యంత ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రామన్ను 1924లో ఇంగ్లండ్ రాయల్ సొసైటీ సభ్యత్వం.. 1928లో సర్ బిరుదు దక్కింది. ప్రతిష్ఠాత్మకమైన ఫ్రాంక్లిన్ మెడల్ 1947లో లభించింది. సి.వి. రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు.
తన అనన్య సామాన్య పరిశోధనా సామర్ధ్యంతో ఫిజిక్స్ రంగంలో రామన్ ఎఫెక్ట్ కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28 నే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. 1987 ఫిబ్రవరి నుండి ప్రతీ సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం అధికారకంగా జరుపుతోంది.
విజ్ఞాన ఆవిష్కరణల్లో భారతీయులకు నోబుల్ రావడం గగనం. అలాంటిది సర్ సీవీ రామన్ ఆ ఘనత సాధించారు. అంతేకాదు, విజ్ఞాన శాస్త్రంలో ఆఘనత సాధించిన ఏకైక ఆసియా వాసిగానూ ఖ్యాతిగడించారు. పరిశోధనల కోసం భారతీయులు విదేశాలకు వెళ్లడమేంటి?. విదేశీయులే.. పరిశోధనల కోసం ఇక్కడకు రావాలని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి రామన్.
More Stories
బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు
2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల
బెంగళూరులో సగం మంది ఓటర్లు ఇంటికే పరిమితం