ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధ భయం

ఉక్రెయిన్‌ పై తమకు యుద్ధం చేసే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని, తమ సేనలను వెనుకకు రప్పిస్తున్నామని రష్యా ఎంతగా చెబుతున్నా ఆ ప్రాంతంలో యుద్ధ భయం పోవడం లేదు. తాజాగా ఉక్రెయిన్‌నుంచి విడిపోయిన రెండుప్రాంతాల వేర్పాటువాద నాయకులు శనివారం యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ దాడులు మరింత తీవ్రమవుతాయనే భయాలు మొదలయ్యాయి. 

తూర్పు ఉక్రెయిన్‌లోని కొన్ని భాగాల్లో దాడులు గణనీయంగా పెరిగాయని యూరప్‌లోని ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ నిపుణులు నివేదిక ఇచ్చిన కొద్ది వ్యవధిలోనే ఈ ప్రకటనలు వెలువడడం గమనార్హం. ఈ మేరకు శనివారం తాజాగా జరిగిన దాడులపై ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. 

ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల డొనెట్స్ పీపుల్స్ రిపబ్లిక్ నాయకుడు డెనిస్ పుషిలిన్ తన తోటి సైనికులను సైనిక నిర్బంధ కార్యాలయానికి రమ్మని కోరడమే కాకుండా తాము యుద్ధానికి సిద్ధమనే డిక్రీపై సంతకం చేసిన విషయం గురించి ఓ వీడియోలో వెల్లడించాడు. లుగాన్స్ వేర్పాటువాద ప్రాంత నాయకుడు లియోనిద్ పసెచ్నిక్ కూడా అదే సమయంలో తన ప్రాంతంలోని దాడులను తిప్పి కొట్టడానికి సిద్ధం అని సంతకం చేసిన డిక్రీని ప్రచురించాడు.

అయితే ఉక్రెయిన్ భద్రతా దళాలే దాడులు మొదలు పెట్టాయని.. తాము ఆ దాడులను అడ్డుకున్నామని వేర్పాటువాద నాయకుడు పుషిలిన్ పేర్కొన్నాడు. అంతేకాదు తామంతా కలిసికట్టుగా విజయం సాధించడమే కాకుండా రష్యా ప్రజలను కాపాడుతామని ప్రకటించాడు. 

కాగా 2014లో రష్యాలో విలీనమైన క్రిమియన్ ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకునే నిమిత్తం ఉక్రెయిన్ వేర్పాటువాదులపై దాడులు జరుపుతోందన్న ఆరోపణలను ఉక్రెయిన్ ప్రభుత్వం ఖండించింది. 

ఇదిలా ఉండగా వేర్పాటువాదుల అధీనంలో ఉన్న ప్రాంతాల్లో తాజాగా పేలుళ్లు సంభవించడంతో ఆ ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున రష్యాలోని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వేర్పాటువాద ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతాల వారికోసం రష్యా 7 లక్షలకు పైగా పాస్‌పోర్టులను జారీ చేసినట్లు వారు తెలిపారు. ముందుగా మహిళలు, పిల్లలు, వృద్ధులను తరలిస్తామని తెలిపారు.

 ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ రష్యా తాను ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికలో భాగంగా శనివారం భారీ ఎత్తున సైనిక విన్యాసాలను నిర్వహించింది. ఇందులో భాగంగా అణ్వస్త్రాలను మోసుకెళ్లగల అత్యాధునిక హైపర్‌సోనిక్, క్రూయిజ్, ఖండాంతర క్షిపణుల సామర్థాన్ని పరీక్షించింది. 

అన్ని క్షిపణులు తమ పనితీరు లక్షాలను ధ్రువీకరిస్తూ తమ టార్గెట్లను తాకాయని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విన్యాసాల్లో టియు95 బాంబర్ యుద్ధ విమానాలు, జలాంతర్గాములు కూడా పాల్గొన్నాయని ఆ ప్రకటన తెలిపింది. శత్రువుపై కచ్చితమైన దాడి లక్షంగా బలగాల సన్నద్ధతను, అణు, సంప్రదాయ ఆయుధాల సామర్థాన్ని ధ్రువీకరించుకోవడం, ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశమని రష్యా సాయుధ దళాల ప్రధానాధికారి వలెరీ గెరాజిమోవ్ అధ్యక్షుడు పుతిన్‌తో చెప్పారు.

 ఉక్రెయిన్‌పై మరికొన్ని రోజుల్లో దాడి చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పునరుద్ఘాటించారు. మహా విపత్కరమైన, అవసరం లేని యుద్ధాన్ని ఎంచుకున్నందుకు బాధ్యత వహించాలని రష్యాను బైడెన్ హెచ్చరించారు. రానున్న కొద్ది రోజుల్లో ఉక్రెయిన్‌పై దాడికి రష్యా దళాలు ప్రణాళిక రచిస్తున్నాయని,ఆలోచిస్తున్నాయని విశ్వసించడానికి తగిన కారణం ఉందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రాజధానినగరం కీవ్‌పై రష్యా దళాలు దాడి చేస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.