ఉక్రెయిన్‌లో యుద్ధమేఘాలపై భారత్ అప్రమత్తం

ఉక్రెయిన్‌లో నివసించే భారతీయులు వీలయితే ఆ దేశాన్ని వీడాలని భారత ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన చేసింది.‘ఉక్రెయిన్‌లోని అస్థిర పరిస్థితులను భారతీయులు దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇక్క డ ఉండాల్సిన అవసరం లేని విద్యార్థులు తాత్కాలికంగా దేశం వీడే అవకాశాన్ని పరిశీలించాలి’ భారత దౌత్య కార్యాలయం ప్రకటించింది. 

అలాగే భారతీయలు ఉక్రెయిన్‌కు రావడం, ఆ దేశంలోపల అత్యవసరం కాని ప్రయణాలను మానుకోవాలని కూడా ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత్‌ ఈ హెచ్చరికలను జారీ చేసింది. ఇప్పటికే పలు దేశాలు తమ దేశస్థులను ఉక్రెయిన్‌నుంచి వెనక్కి వచ్చేయాలని ఆదేశించాయి. ఈ జాబితాలో అమెరికా,జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఐర్లాండ్, బెల్జియం, నెదర్లాండ్,కెనడా, నార్వే, ఆస్ట్రేలియా, జపాన్, ఇజ్రాయెల్, సౌదీ, యుఎఇ తదితర దేశాలున్నాయి.

కాగా ఉక్రెయిన్‌లోని భారతీయులనుఆదుకుంటామని, అవసరమైన సహాయ, సమకారాలను అందజేస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత రాయబార కార్యాలయం ఉక్రెయిన్‌లోని పరిస్థితులను పర్యవేక్షిస్తోందని, అవసరమైన ప్రతి ఒక్కరికీ సహాయ, సహకారాలు అందజేస్తామని విదేశాంగ శాఖ సహాయమంత్రి మీనాక్షి లేఖి తెలిపారు.

‘కావలసిన మార్గదర్శకాలు జారీ చేశాం. దీంతో ఉక్రెయిన్‌లోని భారతీయులకు కచ్చితమైన సమాచారం అందుతుంది. మా హాట్‌లైన్లు, ఇమెయిల్స్ అన్నీ పని చేస్తున్నాయి. మన రాయబార కార్యాలయం పూర్తి స్వింగ్‌లో పని చేస్తోంది. దేశాన్ని వీడడం కానీ, ఇతర సహాయ, సహకారాలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని మీనాక్షి లేఖి వెల్లడించారు.

భారతీయులు ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉంటూ వారి వివరాలను పంచుకోవాలని ఆమె కోరారు. ఉక్రెయిన్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 20 వేల మంది భారతీయ విద్యార్థులు ముఖ్యంగా ఇంజనీరింగ్, వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.`