ఉక్రెయిన్ లో క్లిష్ట పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులు

యుద్ధ మేఘాలు ఆవహించిన ఉక్రెయిన్ ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చదువుతోన్న భారతీయ విద్యార్థులు క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్నారని,  వారందరినీ వెనక్కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ రాజస్తాన్‌కి చెందిన కాంగ్రెస్‌ నేత చర్మేశ్‌ శర్మ రాష్ట్రపతి కార్యలయంలో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
భారత దేశానికి చెందిన సుమారు 20 వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో విద్యను అభ్యసిస్తున్నారని, అక్కడ విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ .. ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని చర్మేశ్‌ శర్మ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
ఏపి, తెలంగాణ, కేరళ, పంజాబ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాలకు చెందిన అధిక శాతం మంది విద్యార్థులు పశ్చిమ ఉక్రెయిన్‌లో ఉంటున్నట్లు సమాచారం. భారత్‌లో మెడికల్‌ సీటు సాధించడం కష్టమని.. కేవలం 88 వేల మెడికల్‌ సీట్లకు ఏటా 8 లక్షల మంది ఎంట్రన్స్‌ పరీక్షలకు హాజరువుతన్నారని తెలుస్తున్నది.
 
 ఈ పరిస్థితితో పోలిస్తే ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదవడం చాలా సులువని, అక్కడి కాలేజీల్లో సీట్లు సులభంగా లభిస్తాయని అనేక మంది అభిప్రాయపడ్డారు. యుద్ధం వార్తలతో ఇప్పటికే ఉక్రెయిన్‌కు వెళ్లాల్సిన అనేక అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దైపోయాయి.పలు దేశాలు తమ రాయబార కార్యాలయాల్లోని సిబ్బందిని వెనక్కు రప్పించుకున్నాయి.
స్వదేశానికి వచ్చేయాలంటూ అమెరికా, బ్రిటన్‌, నార్వే, జపాన్‌, లాట్వియా, డెన్మార్క్‌ దేశాల ప్రభుత్వాలు ఉక్రెయిన్‌లోని తమ పౌరులకు సూచించాయి. ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లోదొమిర్‌ జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ఫోన్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఉద్రిక్తత తొలగించేందుకు దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగించాలని ఇరు నేతలు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు అమెరికా కట్టుబడి ఉందని బైడెన్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారని పేర్కొన్నాయి. రష్యా ఏ క్షణంలోనైనా ఉక్రెయిన్‌పై దాడి చేయవచ్చంటూ అమెరికా హెచ్చరిస్తున్నది.  ఉక్రెయిన్‌ సరిహద్దు వద్ద రష్యా సైన్యాల మోహరింపు, సైనిక విన్యాసాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని బైడెన్‌ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న జేక్‌ సల్లివన్‌ పేర్కొన్నారు.