సమాజం కోసమే జీవించిన వ్యక్తి పద్మశ్రీ టీవీ నారాయణ

సమాజ హితం కోసం జీవించిన గొప్ప వ్యక్తి పద్మశ్రీ టీవి నారాయణ అని హర్యానా గవర్నర్ బండారు దత్తత్రేయ కొనియాడారు. అందరూ అభిమానించే గొప్ప వ్యక్తి టీవీ నారాయణ అని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. 
 
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పద్మశ్రీ టీవీ నారాయణ సంస్మరణ సభలో బండారు దత్తత్రేయ, కిషన్ రెడ్డిలతో పాటు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్  చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామి, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, మాజి డీజీపీ కృష్ణ ప్రసాద్, ఐ.ఏ.ఎస్ అధికారి విద్యా సాగర్ తదితరులు పాల్గొని టీవీ నారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
 
ఈ సందర్భంగా వారు పద్మశ్రీ టీవీ నారాయణతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.  గవర్నర్ బండారు దత్తత్రేయ మాట్లాడుతూ. పద్మశ్రీ టీవీ నారాయణ విద్యావేత్తగా, రచయితగా, సామజిక వేత్తగా, మానవతావాదిగా, చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. జీవితాంతం నీరాడంబరంగా బతికారని, తన జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. 
 
కిషన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే గా ఉన్నపుడు చాలా సార్లు ఆయనతో వేదికలు పంచుకున్నానని చెప్పారు.  పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబెర్ గా ఉండి కూడా ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేస్తూ నిరాడంబర జీవితాన్ని గడిపారని కొనియాడారు. 
 
ట్యాంక్ బండ్ పై టీవీ నారాయణ  విగ్రహం పెట్టాలని బీజేపి వివేక్ వెంకటస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరాడంబర జీవితాన్ని గడిపారని, విద్యా విధానంలో మార్పులు రావాలని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. టీవి నారాయణ సతీమణి, మాజీ మంత్రి టీ.ఎన్ సదాలక్ష్మి సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆర్య సమాజంలో ఎన్నో సంస్కరణలు చేశారని, భగవద్గీత మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందారని వక్తలు గుర్తు చేసుకున్నారు.