‘నా శాఖలైన పౌర సరఫరాలు, పర్యావరణ శాఖల సమీక్షకు రాష్ట్ర మంత్రులెవరూ హాజరవలేదు. ప్రొటోకాల్ పాటించలేదు. అతిథి మర్యాద లేదు’ అని కేంద్ర అటవీ, పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అసహనం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో జరిగిన సమీక్షకు ఆయా శాఖల అధికారులే వచ్చారని విచారం వ్యక్తం చేశారు. ‘కేంద్రమంత్రిగా రెండు కీలకశాఖల సమీక్షను శనివారం నిర్వహించాను. ఇందుకు సంబంధించిన కేంద్ర మంత్రిగా షెడ్యూలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముందే పంపాం. దురదృష్టవశాత్తు ఆయా శాఖలకు చెందిన మంత్రులు హాజరుకాలేదు. ప్రొటోకాల్ ప్రకారమైనా వారు హాజరుకావాల్సి ఉంది’ అని తెలిపారు.
ఆదివారం రాత్రి మీడియాతో చౌబే మాట్లాడుతూ ‘2021లో 141.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది. రైతులకు రూ. 26 వేల కోట్లు చెల్లించింది’ అని చెప్పారు. రాష్ట్రంలోని నల్గొండ, పటాన్చెరు, సంగారెడ్డితో పాటు హైదరాబాద్లో నేషనల్ ఎయిర్ క్లీన్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
కేసీఆర్ కేంద్రంపై చేస్తున్న అవినీతి ఆరోపణల్లో నిజం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మోదీ చరిత్రలో అవినీతికి తావులేదని తేల్చి చెప్పారు. కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే అది మీ మీదే పడుతుందని కేసీఆర్ ను హెచ్చరించారు.
తెలంగాణతో ఇతర రాష్ట్రాల రేషన్ షాపుల్లో 2023 కల్లా ఫోర్టిఫైడ్ రైస్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 2024లో దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. ‘తెలంగాణలో 25 రైస్ మిల్లులు తమ మిషనరీని అప్గ్రేడ్ చేసుకున్నాయి. మున్ముందు మిగతా రైస్ మిల్లులూ అప్గ్రేడ్ కానున్నాయి’ అని అశ్వనీకుమార్ చౌబే వివరించారు.
More Stories
నేటి నుండి తెలంగాణాలో థియేటర్ల మూసివేత
హైదరాబాద్ లో రీ పోలింగ్ కు బీజేపీ అభ్యర్థి డిమాండ్
ఉమ్మడి రాజధాని గడువు ముగింపుతో ఏపీ ఆస్తుల స్వాధీనం!