భారత జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ) చేతిలోని షేర్ల విలువ డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి రూ. 9.53 లక్షల కోట్లు. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే ఈ విలువ 1.46 శాతం ఎక్కువైనట్లు ప్రైమ్ డేటాబేస్ అధ్యయనం వెల్లడించింది. ఎన్ఎస్ఈలో లిస్టింగ్ పొందిన 278 కంపెనీలలో ఒక శాతం కంటే ఎక్కువే ఎల్ఐసీ చేతిలో ఉన్నట్లు పేర్కొంది.
ఈక్విటీ పెట్టుబడులలో ఇన్సూరెన్స్ కంపెనీల వాటా చూస్తే 77 శాతంతో ఎల్ఐసీనే ముందు వరుసలో ఉంది. డిసెంబర్ 2021 చివరి నాటికి ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీకి 49.24 శాతం, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్లో 45.24 శాతం వాటాలు ఉన్నాయి.
ఐటీసీలో 16.21 శాతం, హిందుస్థాన్ కాపర్లో 14.22 శాతం, ఎన్ఎండీసీలో 14.16 శాతం, ఎంటీఎన్ఎల్లో 13.12 శాతం, ఎల్ అండ్ టీలో 12 శాతం, ఆయిల్ ఇండియాలో 11.85 శాతం వాటాలు ఎల్ఐసీ చేతిలో ఉన్నాయి.
విలువపరంగా చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఎల్ఐసీకి ఉన్న షేర్ల విలువ రూ. 95,274 కోట్లు. టీసీఎస్, ఇన్ఫోసిస్లు రెండింటిలోనూ కలిపి ఎల్ఐసీ షేర్ల విలువ రూ. 95,488 కోట్లు. డిసెంబర్ క్వార్టర్లో పవర్ గ్రిడ్, డ్రెడ్జింగ్ ఇండియా, కంప్యూటర్ సర్వీసెస్, కోఫోర్జ్, దీపక్ నైట్రైట్, జేఎస్డబ్ల్యూ స్టీల్ వంటి కంపెనీలలో తన వాటాను ఎల్ఐసీ పెంచుకుంది.
మరోవైపు ఐఆర్బీ ఇన్ఫ్రా, ఏబీబీ ఇండియా, హిందుస్థాన్ మోటార్స్, స్టెర్లైట్ టెక్నాలజీస్, హెచ్ఏఎల్, బాంబే డైయింగ్ వంటి కంపెనీలలో తన వాటాను తగ్గించుకుంది.
ఎల్ఐసీలో తనకున్న నూరు శాతం వాటాలో 5 శాతం మాత్రమే ఐపీఓ ద్వారా అమ్మాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రభుత్వంకు మొత్తం 6.32 బిలియన్ షేర్లుండగా, ఇందులో 316 మిలియన్లు మాత్రమే అమ్మాలనుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
సంప్రదింపులు చివరి దశలో ఉండటంతో, ఇందులో కొంత మార్పు ఉండే అవకాశం కూడా ఉందని పేర్కొన్నాయి. ఎల్ఐసీ ఎంబెడ్డెడ్ విలువను రూ. 5.4 లక్షల కోట్లుగా లెక్కకట్టారు. బుక్ బిల్డింగ్ పద్ధతిలో షేర్ విలువను లెక్కకడతారు. డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ చేరుకోవడానికి ఎల్ఐసీ ఐపీఓను మార్చిలోగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది.
ఎల్ఐసీ ఐపీఓకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) ఆమోదం లభించింది. దీంతో గురువారం సెబీ వద్ద డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేయడానికి ఎల్ఐసీకి వీలవుతుంది. ఎల్ఐసీ ఐపీఓ సైజు రూ. 70 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ఈ లెక్కన చూస్తే లిస్టింగ్ తర్వాత ఎల్ఐసీ మార్కెట్ వాల్యూ రూ. 13–15 లక్షల కోట్ల మధ్యలో ఉండచ్చన మాట.
ఐపీఓలో పాలసీ హోల్డర్లకు 5 శాతం డిస్కౌంట్ఇవ్వాలని ఎల్ఐసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. రిటెయిల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకూ కూడా కొంత రాయితీ ఇవ్వనుంది. ఎల్ఐసీలో ప్రస్తుతం 100 శాతం వాటా ప్రభుత్వం వద్దే ఉంది. కంపెనీ వద్ద లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీ హోల్డర్లు 29 కోట్ల మంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి 2,048 బ్రాంచ్ ఆఫీసులు, 8 జోనల్ ఆఫీసులు, 113 డివిజనల్ ఆఫీసులు, 11.48 లక్షల మంది ఏజంట్లు ఉన్నారు.
More Stories
అమెరికా లేకపోతే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?
కాంగ్రెస్ ను వివాదంలోకి నెట్టిన శ్యామ్ పిట్రోడా
రైల్వే ప్రయాణికులకు రూ.20కే భోజనం