యుపిలోని ఉన్నావ్ జిల్లాలో మరో దారుణమైన ఘటన జరిగింది. రెండు నెలల క్రితం అదృశ్యమైన దళిత యువతి మృతదేహాన్ని సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆశ్రమం పరిసరాల్లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం పూర్తిగా పాడైపోయిందని, పోస్ట్మార్టమ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఆశ్రమం ఎస్పికి చెందిన మాజీ మంత్రి ఫతేఫుర్ బహదూర్ సింగ్దని చెప్పారు. ఆయన కుమారుడు, ప్రధాన నిందితుడు రాజోల్ సింగ్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే గతేడాది డిసెంబర్ 8న 22ఏళ్ల యువతి అదృశ్యమైంది. తన కుమార్తెను మాజీ మంత్రి కుమారుడు రాజోల్ సింగ్ కిడ్నాప్ చేశాడంటూ ఆ యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించాలంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో జనవరి 24న లక్నోలోని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వాహనం ముందు ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. దీంతో అదే రోజున పోలీసులు రాజోల్సింగ్ని అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక నిఘా, మొబైల్ నిఘా ఆధారంగా యువతి మృతదేహాన్ని ఆశ్రమం సమీపంలోని ఖాళీ స్థలంలో పాతిపెట్టనట్లు గుర్తించామని ఉన్నావ్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ శశి శేఖర్ సింగ్ తెలిపారు.
యుపిలో అసెంబ్లీ ఎన్నికలు మొదటిదశ పోలింగ్ గురువారం పూర్తయింది. అయితే అదే రోజు ఈ ఘటన జరగడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఉన్నావో జిల్లాలోని ఎస్పి నేతకి చెందిన స్థలం నుండి దళిత యువతి మృతదేహాన్ని వెలికి తీయడం చాలా బాధాకరమని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ట్వీట్ చేశారు.
యువతి కిడ్నాప్, హత్యలో ఎస్పి నేత ప్రమేయం ఉన్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు. వారి కుటుంబానికి న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
More Stories
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం