మధ్య ప్రదేశ్, పుదుచ్చేరిలకు విస్తరించిన హిజాబ్ వివాదం 

కర్ణాటకలో చెలరేగిన హిజాబ్‌ వివాదం సరిహద్దులను దాటి మధ్యప్రదేశ్‌, పుదుచ్చేరిలకు విస్తరించింది. మధ్యప్రదేశ్‌లో ఓ మంత్రి హిజాబ్‌ను వ్యతిరేకించగా.. పుదుచ్చేరి అరియాం కుప్పంలో ఓ విద్యార్థిని హిజాబ్‌ ధరించడంపై ఉపాధ్యాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం క్రమశిక్షణకు ప్రాధాత్యనిస్తుందంటూ హిజాబ్‌ నిషేధానికి మధ్యప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ మంత్రి ఇందర్‌ సింగ్‌ పర్మార్‌ మద్దతునిచ్చారు. హిజాబ్‌ స్కూల్‌ యూనిఫాం కాదని, అందుకే పాఠశాలల్లో దాని ధరించడం నిషేధించాలని అన్నారు. సంప్రదాయాలను ప్రజలు వారి ఇళ్లల్లో పాటించాలని, పాఠశాలల్లో కాదంటూ స్పష్టం చేశారు. 

స్కూల్స్‌లో డ్రెస్‌ కోడ్‌ను కఠినంగా అమలు చేయడానికి తాము కృషి చేస్తామని తెలిపారు. స్కూల్స్‌లో హిజాబ్‌ను నిషేధిస్తారా అన్న ప్రశ్నకు  ఈ సమస్యను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

మరో వైపు పుదుచ్చేరిలో .ఓ విద్యార్థిని ధరించిన హిజాబ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఉపాధ్యాయుడిపై విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థల నుండి తమకు ఫిర్యాదులు అందాయని విద్యా డైరెక్టరేట్‌ ప్రతినిధి తెలిపారు. అసలేం జరిగిందో పాఠశాల నుండి నివేదిక స్వీకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.