ఒమిక్రాన్‌ తో ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షల మంది మృతి

ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగుచూసిన తర్వాతే ప్రపంచ వ్యాప్తంగా 5లక్షల మరణాలు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఆవేదన వ్యక్తం చేసింది. ఇవి విషాదాన్ని మించిన గణాంకాలని పేర్కొంది.  గత నవంబర్‌లో ఒమిక్రాన్‌ వెలుగుచూసిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రపపంచ వ్యాప్తంగా 130 మిలియన్‌ కేసులు (13 కోట్లు) 5 లక్షల మరణాలు నమోదయ్యాయని డబ్ల్యుహెచ్‌ఒ ఇన్సిడెంట్‌ మేనేజర్‌ అబ్దీ మహ్మద్‌ చెప్పారు. 
 
గత ఏడాది ప్రపంచాన్ని వణికించిన డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్‌ అధిగమించిందని, తీవ్రమైన అనారోగ్యానికి దారి తీసే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. అత్యంత వేగంగా వ్యాప్తి చేసే గుణమే అందుకు కారణమని పేర్కొన్నారు. 
 
వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతున్న సమయంలో కూడా 5 లక్షల మంది ప్రజలు చనిపోయారని, ఏదో జరుగుతుందని ఓ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ వల్ల పెద్ద ప్రమాదమేమీ లేదని ప్రతి ఒక్కరూ భావించినప్పటికీ.. వెలుగుచూసిన నాటి నుండి అర మిలియన్‌ మంది చనిపోవడం ఆందోళన కల్గించే అంశమని చెప్పారు.

ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని డబ్ల్యుహెచ్‌ఒ టెక్నికల్‌ హెడ్‌ మరియా వాన్‌కెర్‌ఖోవ్‌ కూడా తెలిపారు. అనుకున్న వాటి కంటే అధికంగా వాస్తవ కరోనా కేసులు, మరణాలు ఉన్నాయని తెలిపారు. మనం ఇంకా మహమ్మారి దశ మధ్యలో ఉన్నామని, ముగింపు దశకు చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. 
మరణాలు పెరగడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ ప్రమాదకారిగా కొనసాగుతోందని చెప్పారు. ఒమిక్రాన్‌లో నాలుగు ఉప వేరియంట్లు (జాతులు) ఉన్నాయని, ఇందులో బిఎ-1 సబ్‌స్ట్రెయిన్‌ .. ప్రబలంగా ఉన్నప్పటికీ.. బిఎ.2 వేగంగా వ్యాపిస్తుందని, అదే ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదలకు కారణమౌతుందని డబ్ల్యుహెచ్‌ఒ పేర్కొంది.
బిఎ1 కంటే… బిఎ2 తీవ్రమైన వ్యాధికి దారితీసిందని సూచించడానికి ఎటుంటి ఆధారాలు లేవని, అయితే సాక్ష్యాధారాల సేకరణలో ఇవి ప్రారంభరోజులేనని మరియా అన్నారు. ఎవరికైనా.. ఈ రెండు వేరియంట్లు ఒకేసారి సోకుతాయా అన్న దానికి తమ వద్ద సమాధానం లేదని మహ్మద్‌ తెలిపారు.