![](https://nijamtoday.com/wp-content/uploads/2022/02/Amit-Shah-RS.jpg)
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కల్పించిన భద్రతకు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సమ్మతించాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా రాజ్యసభ వేదికగా విజ్ఞప్తి చేశారు. యూపీలోని మీరట్లో ఒవైసీ కారుపై దుండగులు ఇటీవల కాల్పులు జరిపిన ఘటన సంచలనం సృష్టించింది. దీనిపై అమిత్షా రాజ్యసభలో ఒక ప్రకటన చేస్తూ, ఘటన జరిగిన వెంటనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకున్నామని చెప్పారు.
దీనికి ముందు కేంద్ర భద్రతా సంస్థల సమాచారం మేరకు ఒవైసీకి భద్రత కల్పించాలని కేంద్రం ఆదేశించినట్టు చెప్పారు. అయితే, అందుకు ఒవైసీ ఇష్టపడలేదని, ఢిల్లీ, తెలంగాణ పోలీసులు ఆయనకు భద్రత కల్పించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదని చెప్పారు.
దీంతో ఒవైసీ భద్రతను మరోసారి అంచనా వేసి ఒక బుల్లెట్ ఫ్రూవ్ కారు, జడ్ కేటగిరి సెక్యూరిటీ కేటాయించామని తెలిపారు. అప్పుడు కూడా ఒవైసీ నిరాకరించినట్టు సభకు తెలిపారు. ఒవైసీపై కాల్పుల ఘటన జరిగిన వెంటనే తక్షణ చర్యలు చేపట్టామని, ఆ ఘటనతో ప్రమేయం ఉన్న ఇద్దర్ని అరెస్టు చేశామని, లైసెన్స్ లేని రెండు పిస్తోళ్లు, ఒక ఆల్టో కారు వారి నుండి స్వాధీనం చేసుకున్నామని అమిత్షా తెలిపారు.
ఫోరెన్సిక్ టీమ్ సైతం సాక్ష్యాలను సేకరించిందని పేర్కొన్నారు. హపూర్ జిల్లాలో పర్యటనకు సంబంధించి ఒవైసీ ప్రీషెడ్యూల్ కూడా లేదని, ఆయన పర్యటనకు సంబంధించిన సమాచారం కూడా జిల్లా కంట్రోల్ రూమ్కు తెలియజేయలేదని పేర్కొన్నారు. కాల్పుల ఘటన అనంతరం ఒవైసీ సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నట్టు అమిత్షా వివరించారు.
More Stories
మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం నేడే
ఆన్లైన్ వార్తలపై నియంత్రణకు బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్లు!
భారత్లో ఏటా 2.5 శాతం పెరుగుతున్న క్యాన్సర్ కేసులు