జేఎన్‌యూ తొలి మ‌హిళా వీసీగా శాంతిశ్రీ పండిట్

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కేంద్రం ఆచార్య డి శాంతి శ్రీ పండిట్ను నియమించింది. ప్రస్తుతం సావిత్రీబాయి పూలే వర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్న ఆమెకు జేఎన్యూ బాధ్యతలు అప్పగించింది. జేఎన్యూ వీసీగా మహిళా ప్రొఫెసర్ను నియమించడం ఇదే తొలిసారి. ఆమె నియామకానికి.. యూనివర్శిటీ విజిటర్‌గా ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. 

శాంతి శ్రీ ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీసీగా ఉన్న ఎం. జగదీశ్ కుమార్ పదవీకాలం గతేడాది డిసెంబర్తో ముగిసింది. కొత్త వీసీ నియామకం వరకు తాత్కాలిక వీసీ బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు. తాజాగా జగదీశ్ కుమార్ యూజీసీ ఛైర్మన్ గా నియమితులవడంతో కేంద్రం శాంతి శ్రీని జేఎన్యూ వీసీగా నియమించింది.

శాంతి శ్రీ పండిత్ ప్రస్తుతం ఫూలే విశ్వవిద్యాలయంలో పొలిటిక‌ల్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. శాంతి శ్రీ 1988లో గోవా యూనివర్సిటీలో అధ్యాపక వృత్తి ప్రారంభించారు. 1993లో పూనే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరారు. 

ఆమెకు తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ మాట్లాడతారు. కన్నడ, మలయాళం, కొంకణి భాషలను అర్థం చేసుకోగలరు. చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత జేఎన్‌యూలో ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేశారు. ఆమె పీహెచ్‌డీ థీసిస్ సబ్జెక్ట్ ‘పార్లమెంట్ అండ్ ఫారిన్ పాలసీ ఇన్ ఇండియా- ది నెహ్రూ ఇయర్స్’.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యురాలిగా ఉన్న ఆమె.. సెంట్రల్ యూనివర్సిటీల విజిటర్ నామినీగా ఉన్నారు. జేఎన్‌యూ కొత్త వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులైన ప్రొఫెసర్ పండిట్‌కు యూజీసీ ఛైర్మన్ ఎం. జగదీశ్ కుమార్ అభినందనలు తెలిపారు. 

శాంతి శ్రీ పండిట్ తండ్రి ధూళిపూడి ఆంజనేయులు. డి.ఏ.గా సుపరిచితులైన ఆయన ప్రముఖ ఇంగ్లిష్ జర్నలిస్ట్, రచయిత. చాలా తెలుగు రచనల్ని ఇంగ్లీష్లోకి అనువదించారు. శాంతి శ్రీ తల్లి మూలమూది ఆదిలక్షి రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ యూనివర్శిటీలో తెలుగు, తమిళం ప్రొఫెసర్గా పనిచేశారు.

శాంతి శ్రీ 1962లో రష్యాలోనే పుట్టారు. పుట్టిన 15 రోజులకే తల్లి చనిపోవడంతో రష్యా ప్రభుత్వం 16 నెలల పాటు పెంచి అనంతరం తండ్రికి అప్పగించింది. 18ఏళ్ల వయసులో ఆమె రష్యా సిటిజెన్షిప్ వదలుకున్నారు. శాంతిశ్రీ తండ్రికి చెన్నైలో దేశంలో అతిపెద్ద పర్సనల్ లైబ్రరీ ఉండేది. ఆమె చెన్నైలోని డిగ్రీ వరకు చదువుకున్నారు. 

1998 డిసెంబర్లో ఆయన చనిపోయాక ఆమె ఆ లైబ్రరీని పూనేకు మార్చారు. మహారాష్ట్రకు చెందిన ఆమె భర్త ప్రస్తుతం అమెరికాలో ఐటి ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నారు. ఆమె కుమార్తె కూడా అమెరికాలోనే పనిచేస్తున్నారు. 

ఇండియన్ పొలిటికల్ సైన్స్ అధ్యక్షురాలిగా కూడా పనిచేసిన ఆమె అనేక థింక్ ట్యాంక్ లలో పనిచేశారు. అనర్గళంగా పలు అంశాలపై ప్రసంగించగల ఆమె వద్ద ఎందరో విద్యార్థులు పరిశోధనలు చేశారు. మూడు గ్రంధాలను రచించిన ఆమె 170కు పైగా పరిశోధన పత్రాలు రచించారు. 

ఆమె 1995 నుండి పుణెలోని సైనిక గూఢచార శిక్షణ పాఠశాలలో  ఆసియ,పసిఫిక్ ప్రాంతంలో భారత్ భద్రతా సమస్యల గురించి అవగాహన కల్పించడంలో సహకరిస్తున్నారు.