కాంగ్రెస్‌ది విభజించే మనస్తత్వం

కాంగ్రెస్‌ది విభజించే మనస్తత్వం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తూబహుళ సంస్కృతులు, వైవిధ్యం కలిగిన దేశంలో విభజించు, పాలించు అనే బ్రిటిష్ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ అనుసరిస్తోందని కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు.

ఫెడరలిజాన్ని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు సమాధానమిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ మాటలతో తిప్పికొట్టారు. అంగ్రేజ్ ఛలేగయే ( బ్రిటిష్ వారు వెళ్లిపోయారు),అయినా విభజించు, పాలించు అన్నది మాత్రం మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. అందువల్ల కాంగ్రెస్ “తుక్డే, తుక్డే గ్యాంగ్ ” కు నాయకత్వంగా ఎదిగిందని విమర్శించారు. 

జవహర్‌లాల్ పుస్తకం డిస్కవరీ ఆఫ్ ఇండియాను ప్రస్తావిస్తూ బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తమిళ, ఆంధ్ర, అస్సామీలు, కన్నడ, మళయాలీ, సింధి, పంజాబీ, హిందుస్థానీ …. వీరంతా వందల ఏళ్లుగా తమ స్వయం గుర్తింపును కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లోని సాంస్కృతిక తేడాలను ఉదహరిస్తూ రాహుల్ గాంధీ మా నాయనమ్మ (మాజీ ప్రధాని ఇందిర)32 తుపాకీ గుళ్లకు బలయ్యారని, నా తండ్రి (మాజీ ప్రధాని రాజీవ్) పేలుడులో తునాతునకలయ్యారని ఉదహరించారు. 

మీరు ప్రమాదంతో ఆడుకుంటున్నారని, ఇది ఆపకపోతే మీరు సమస్యలు సృష్టిస్తారని రాహుల్ చేసిన వ్యాఖ్యలకు మోదీ  సమాధానమిస్తూ దేశం నిబంధనల ప్రకారం కానీ ప్రభుత్వం వల్ల కానీ ఏర్పడింది కాదని, అది మనకు ఆత్మ వంటిదని, వెయ్యేళ్లుగా ప్రజలు దానితో అనుసంధానమై ఉన్నారని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విష్ణుపురాణం పాఠాన్ని ఉదహరించారు.

దేశంలో కరోనా వ్యాప్తికి, వలస కార్మికుల సంక్షోభానికి ప్రతిపక్షాలే కారణమని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఎక్కడివారు అక్కడే ఉండాలని డబ్ల్యూహెచ్‌వో సలహా ఇస్తే.. కాంగ్రెస్‌ నేతలు ముంబయి రైల్వేస్టేషన్‌లో కార్మికులకు టికెట్లు ఇచ్చి ఇళ్లకు వెళ్లమన్నారని, కరోనా వైర్‌సను వ్యాప్తి చేయాలని చెప్పారని విమర్శించారు. 

కాంగ్రెస్‌ హద్దులు మీరి వ్యవహరించిందని, కార్మికులను కష్టాల్లో ముంచిందని మండిపడ్డారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం మురికివాడలకు జీపుల్లో వెళ్లి మరీ.. ఇళ్లకు వెళ్లాలని మైకుల్లో ప్రకటనలు చేసిందని, బస్సులను కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు, దీంతో అప్పటివరకు కరోనా లేని ఉత్తరప్రదేశ్‌, ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపించిందని గుర్తు చేశారు. 

దేశం మొత్తం మీద కరోనా వ్యాప్తి చెందడానికి విపక్షమే కారణమని, సానుకూలంగా ఏదీ చేయలేదని స్పష్టం చేశారు.  కరోనా జాగ్రత్తలు ప్రజలకు చెప్పడం కానీ, పాటించేలా చేయడం కానీ ఏదీ చేయలేదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆరోపించారు. కరోనా పాపం కాంగ్రెస్‌దేనని, ఆ పార్టీ వందేళ్ల వరకు అధికారం లోకి రాలేదని ధ్వజమెత్తారు.

కరోనా తొలి విడతలో వలస కార్మికులను భయాందోళనలకు గురిచేసి వారు తమ గ్రామాలకు వెళ్లి కరోనాను వ్యాపించేలా కాంగ్రెస్ చేసిందని ఆరోపించారు. మరోవైపు తమ ప్రభుత్వం కరోనా కట్టడి, నియంత్రణతోపాటు వ్యాక్సినేషన్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధాని చెప్పుకొచ్చారు.

యూపీఏ హయాంలోనే ద్రవ్యోల్బణం 10 శాతం పైగా ఉందని, తాము అధికారంలోకి వచ్చాక 2014-2020 మధ్య ద్రవ్యోల్బణం 5 శాతం కంటే తగ్గిందని ప్రధాని తెలిపారు. ధరల పెరుగుదల కాంగ్రెస్‌ తొలి ప్రధాని నెహ్రూ కాలంలో కూడా ఉండేదని పేర్కొన్నారు. రూ.15కు మినరల్‌ వాటర్‌ బాటిల్‌ కొనేవారు గోధుమలు, బియ్యం ధరలు పెరిగితే ఎందుకు భరించలేరంటూ యూపీఏ హయాంలో అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

దేశంలో కాంగ్రెస్ తన ప్రభావాన్ని కోల్పోతోందని చెబుతూ వందేళ్ల చరిత్ర ఉన్న ఆ పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు. 1998 నుంచి నాగాలాండ్, 24 ఏళ్లుగా ఒడిశాలో, చాలా ఏళ్లు గోవాలో, 1972 తరువాత బెంగాల్‌లో, 1962 తరువాత తమిళనాడులో, సుమారు పదేళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ తిరిగి అధికారం లోకి రాలేదని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ వ్యవహార శైలి చూస్తుంటే వందేళ్లయినా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేలా లేదని, తాము కూడా అందుకు రంగం సిద్ధం చేశామని ప్రధాని స్పష్టం చేశారు. పార్టీ అంశాల కోసం పార్లమెంటును వేదికగా చేసుకుంటున్నారని అందుకే తాను ఇలా స్పందించానని మోదీ  కాంగ్రెస్‌ను ఉద్దేశించి తెలిపారు. తన ప్రసంగానికి ముందు ప్రముఖ గాయని లతామంగేష్కర్ కు మోదీ  నివాళి అర్పించారు.