ములాయం సన్నిహితుడు బిజెపిలోకి

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ)కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) మాజీ నేత, ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన శివకుమార్ బేరియా నేడు బీజేపీలో చేరారు. సమాజ్‌వాదీ ప్రభుత్వ హయాంలో బేరియా మంత్రిగానూ పనిచేశారు. కాగా, ఎస్‌పీ ఎమ్మెల్సీ రమేశ్ మిశ్రా కూడా బీజేపీలో చేశారు. 
అయితే, ఈ నెల 13న ఎస్‌పీలో చేరిన బీజేపీ ధౌరారా ఎమ్మెల్యే తిరిగి బీజేపీ గూటికి చేరారు. ములాయంసింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరిన అనంతరం ఈ వరుస పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 2017 ఎన్నికల్లో ఎస్‌పీ టికెట్‌పై లక్నో కంటోన్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణపై పోటీ చేసి 33,796 ఓట్ల తేడాతో అపర్ణ ఓటమి పాలయ్యారు.

అలాగే, మాజీ ఎమ్మెల్యే, ములాయంసింగ్ యాదవ్ బావమరిది ప్రమోద్ గుప్తా కూడా ఈ నెల 20న బీజేపీ కండువా కప్పుకున్నారు. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీ వరకు వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు. 

ఎస్పీలోకి రీటా బహుగుణ తనయుడు

మరోవంక, లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో బీజేపీ అలహాబాద్ ఎంపీ రీటా బహుగుణ జోషి తనయుడు మయాంక్ జోషి పార్టీ మారనున్నారు. బీజేపీకి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో సోమవారం సాయంత్రం చేరే అవకాశాలున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
 
ఈనెల మొదట్లో ముగ్గురు మంత్రులతో సహా డజను మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడి అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరడం బీజేపీని ఒక కుదుపు కుదిపింది. రాజీనామా చేసిన ముగ్గురు మంత్రులు ఓబీసీ కేటగిరికి చెందిన వారు 
 
కాగా, సమాజ్‌వాదీ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్న మాయంక జోషి…బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత.  2009 నుంచి మయాంక్ లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గానికి పనిచేస్తున్నందున అతనికి టిక్కెట్ ఇవ్వాలని బీజేపీని కోరినట్టు ఇటీవల రీటా బహుగుణ మీడియాకు వెల్లడించారు.