తెలంగాణలో జాబ్ కాదు.. వైన్ షాపుల నోటిఫికేషన్లే

మద్యం షాపులకు క్రమం తప్పకుండా నోటిఫికేషన్లను ఇస్తున్న సీఎం కేసీఆర్… ఉద్యోగ ఖాళీల భర్తీకి మాత్రం నోటిఫికేషన్స్ ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుండు  అంటూ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. 
 
నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో విద్యార్థులు, నిరుద్యోగులు కోట్లాడి, బలిదానాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే… టీఆర్ఎస్ సర్కార్ పాలనలో నేడు నిరాశే మిగిలిందని ఆమె విమర్శించారు. ఫలితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఏడేండ్లలో ఇప్పటి వరకు 200 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగ ఖాళీలపై ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిపోయాక ఒక మాట మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రి . నిరుద్యోగుల ఆత్మహత్యలకు బాధ్యత వహించాలని ఆమె స్పష్టం చేశారు. 
 
తాజాగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముత్యాల సాగర్ (25) అనే నిరుద్యోగ యువకుడి ఆత్మహత్యకు ముమ్మాటికీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని తేల్చి చెప్పారు. సాగర్ చదువు కోసం తల్లిదండ్రులు కష్టపడి డిగ్రీ వరకు చదివించగా, ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతూ మూడేండ్లుగా ఎదురుచూస్తే.. ప్రభుత్వం నుంచి ఒక్క నోటిఫికేషన్ రావడంలేదని నిరాశ, నిస్పృహతో విసుగుచెందాడని ఆమె తెలిపారు. 
 
సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేస్తూ… కేసిఆర్ పాలనలో ఉద్యోగాలు రావని నిర్ణయించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె విచారం వ్యక్తం చేశారు. సాగర్ ఆత్మహత్య వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిందని చెబుతూ ఇంకా రాష్ట్రంలో ఇలాంటి నిరుద్యోగుల కనబడని చావులు ఎన్ని ఉన్నాయోనని తలచుకుంటేనే బాధ కలుగుతుందని ఆమె చెప్పారు. 
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది నిరుద్యోగులు రాష్ట్ర సర్కార్ చేసే నిర్లక్ష్యానికి బలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే… సీఎం కేసీఆర్ మాత్రం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని విజయశాంతి ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గపు రాచరిక నియంతను రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ యువత కంకణబద్ధులై గద్దె దించడం ఖాయం అని ఆమె హెచ్చరించారు. 
 
ఆత్మహత్యలకు కేసీఆర్ దే బాధ్యత 
 
కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పేర్కొంటూ  బదిలీలు అంటూ 317 జీవోను తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బిజెపి ఎమ్యెల్యే ఈటెల రాజేందర్  ధ్వజమెతతారు. కేసీఆర్ ఉద్యోగులతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
నెటివిటీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని పార్టీల నాయకులు చెప్పిన వినకుండా కేసీఆర్ మొండి వైఖరి అవలంభిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ జీవోతో ఉద్యోగులు ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట వాసి ఉప్పుల రమేష్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు
 
దేశంలో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన దేశంలో ఎక్కడా జరగడం లేదని అంటూ, ఉద్యోగాల సంఘాలతో చర్చించి వెంటనే ఈ జీవోను రద్దు పరిచి వారికి న్యాయం చేయాలని రాజేందర్ డిమాండ్ చేశారు. ఉప్పుల రమేష్ కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. 
 
రమేష్ కుటుంబానికి ఆర్దిక సహాయంగా రూ. 50 వేలను ఈటల రాజేందర్ అందజేశారు. ఉద్యోగుల సంఘాలతో చర్చించి వెంటనే ఈ జీవోను రద్దు పరిచి వారికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంకు హితవు చెప్పారు.