కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తోందని, అయితే అంతగా ప్రమాదకారి కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేసుల సంఖ్య కూడా అధికంగా ఉన్నట్టు పేర్కొంది. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసులలో 77 శాతానికిపైగా పది రాష్ట్రాలే కారణమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే మరణాల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వం విస్తృతంగా టీకాలు పంపిణీ చేస్తోందని అధికారులు వెల్లడించారు. యాక్టివ్ కేసుల సంఖ్య, సంబంధిత మరణాలు ఈ వేవ్లో చాలా తక్కువగా ఉన్నాయి, అంటువ్యాధుల తీవ్రత కూడా ఈ వేవ్లో చాలా తక్కువగా ఉందని వైద్యారోగ్య అధికారులు తెలిపారు.
90 శాతానికి పైగా కేసులు తేలికపాటి నుండి మితమైన తీవ్రతతో హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోతుందని, ఆక్సిజన్, ఐసియు బెడ్లు అవసరమయ్యే కేసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని వైద్యారోగ్య వర్గాలు తెలిపాయి. తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయడం వైరస్తో పోరాడడంలో అత్యంత ముఖ్యమైన దశ అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ పేర్కొన్నారు.
ఇతర వ్యాధులు ఉన్న రోగులు జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాలకు దూరంగా ఉండాలని డాక్టర్ భార్గవ హెచ్చరించారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి కొన్ని గణాంకాలను హైలైట్ చేస్తూ.. 11 రాష్ట్రాల్లో 50,000 కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు.
14 రాష్ట్రాల్లో 10,000 నుండి 50,000 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశంలోని 551 జిల్లాలు ఐదు శాతానికి పైగా సానుకూలత రేటును కలిగి ఉన్నాయి. ఇది గత వారం 527 జిల్లాల నుంచి పెరగడం కనిపిస్తోంది. ప్రభుత్వం టెలిమెడిసిన్ కోసం ఇ–-సంజీవని ప్లాట్ఫారమ్ను కూడా ప్రారంభించింది. ఇప్పటి వరకు 2.3 కోట్లకు పైగా టెలికన్సల్టేషన్ అందించినట్టు అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 2,51,209 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు చేశారు. కరోనాతో గడిచిన 24 గంటల్లో 27 మంది మృతి చెందారు. 3,47,443 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 21,05,611కి చేరింది. కోవిడ్ రోజువారి పాజిటివిటీ రేటు 15.88గా నమోదైంది. 1,64,44,73,216 టీకాలు అందజేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
More Stories
కాశ్మీర్ లో పోలింగ్కు ముందు రెచ్చిపోయిన ఉగ్రవాదులు
దక్షిణాదిన భారీ వర్షాలు.. ఉత్తరాదిన వడగాల్పులు
4 దశలలో మొత్తం 66.95 శాతం పోలింగ్