ప్రపంచానికి మరో కొత్త వైరస్ నియోకోవ్ ఉపద్రవం 

కరోనా మహమ్మారికి సంబంధించిన వేరియంట్లతో గత రెండేళ్లుగా ప్రపంచం వణికి పోతుంటే దక్షిణాఫ్రికాలో మరో కొత్త ప్రాణాంతక వైరస్‌ ను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్‌ కు ‘నియో కోవ్‌’ అని నామకరణం చేశారు. ఇది కరోనా కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని, మరణాల రేటు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని వుహాన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 

దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో గల గబ్బిలాల్లో ‘నియో కోవ్‌’ వైరస్‌ ను గుర్తించారని తెలిపారు. ఇదికూడా కరోనా వైరసేనని పేర్కొన్నారు. కరోనా వైరస్ కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలోని వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలే ఈ పిడుగుపాటి వార్తను తెలిపారు.

 నియోకోవ్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ వెల్లడించింది. అయితే, నియో కోవ్ వైరస్ కొత్తదేమీ కాదని స్పుత్నిక్ నివేదిక చెబుతోంది.

2012 -15 మధ్యకాలంలో పశ్చిమాసియాలో వ్యాపించిన మెర్సికోవ్ కు నియోకోవ్ కు సంబంధం ఉందని అంటోోంది. తొలుత దక్షిణాఫ్రికా గబ్బిలాల్లో గుర్తించిన ఈ  నియోకోవ్ వైరస్ ఇప్పటి వరకు మనుషులకు సోకలేదని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రస్తుతానికి జంతువుల నుంచి జంతువులకు మాత్రమే నియోకోవ్ సోకుతుండగా,  వైరస్ వస్తున్న మ్యూటేషన్ల కారణంగా మనుషులకు సోకే ప్రమాదం పొంచి ఉందని వూహాన్ శాస్త్రవేత్తల  అధ్యయనంలో తేలింది.

కరోనా తరహాలోనే ఇది కూడా అత్యంత వేగంగా మనుషుల్లో వ్యాపించే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.  చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోఫిజిక్స్ తో కలిసి వూహాన్ యూనివర్సిటీ రీసెర్చర్లు చేపట్టిన ఈ అధ్యయన ఫలితాలను ఓ వెబ్ సైట్ లో ప్రచురించారు.

సార్స్ కోవ్ 2 కన్నా వేగంగా వ్యాపించే లక్షణం కలిగిన ఈ  వైరస్ నుంచి యాంటీ బాడీలు, ప్రొటీన్లు రక్షణ కల్పించలేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ కారణంగానే నియోకోవ్ బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే అవకాశముందని అంటున్నారు.