బ్రహ్మోస్‌ మిస్సైల్ ఎగుమతికి తొలి ఆర్డర్

అంతర్జాతీయంగా ఆయుధాల ఎగుమతిలో ఎదగాలన్న భారత ప్రభుత్వ ఆంకాంక్ష దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటికే కొన్ని రకాల ఆయుధాలను ఎగుమతి చేస్తున్న భారత్‌కు తొలిసారిగా బ్రహ్మోస్ క్షిపణి కోసం ఆర్డర్ వచ్చింది. చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న పిలిప్పీన్స్‌ దేశంలో మన బ్రహ్మోస్‌ను కొనుగోలు చేసేందుకు ఇవాళ ఒప్పందం కుదుర్చుకుంది. 
 
సుమారు రూ.2,800 కోట్ల (347 మిలియన్ డాలర్లు) విలువైన ఒప్పందంపై  సంబంధించిన ఈ కాంట్రాక్ట్‌పై శుక్రవారం ఫిలిప్పీన్స్ రక్షణ శాఖ ప్రతినిధులు సంతకం చేశారు. మన దేశం నుంచి డీఆర్డీవో జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఎరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఈ డీల్‌పై సంతకాలు చేశారని భారత డిఫెన్స్ అధికారులు తెలిపారు. 
 
ఫిలిప్పీన్స్ దేశానికి యాంటీ షిప్ మిస్సైల్ తరహా బ్రహ్మోస్ క్షిపణులను అందించేందుకు ఇవాళ కాంట్రాక్ట్ చేసుకున్నట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. 
 
బీఏపీఎల్ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ అని, ఇవాళ జరిగిన కాంట్రాక్ట్ ద్వారా బాధ్యతాయుతమైన రక్షణ ఎగుమతుల దిశగా ఒక కీలకమైన అడుగుపడిందని పేర్కొంది.
 
భారత్, రష్యా కలిసి బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్‌‌ ఈ బ్రహ్మోస్ ఎరోస్పేస్ సంస్థ. బ్రహ్మోస్ క్షిపణిని నేల పైనుంచి, యుద్ధ విమానాల్లో నుంచి, నౌకల్లో నుంచి, సబ్‌మెరైన్లలో నుంచి కూడా ప్రయోగించవచ్చు. సూపర్ సోనిక్ వేగంతో (ధ్వని కంటే సుమారు ఐదింతల వేగంగా) దూసుకెళ్లి శత్రు విధ్వంసాన్ని చేస్తుంది బ్రహ్మోస్ క్షిపణి.