12 మంది `మహా’ బిజెపి ఎమ్యెల్యేల సస్పెన్షన్ రద్దు 

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. మహారాష్ట్ర అసెంబ్లీకి చెందిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను నిరవధికంగా ఏడాదిపాటు సస్పెండ్ చేయడాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది.
 
ఈ సస్పెన్షన్ ను వర్షాకాల సమావేశాలకు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించింది. 12మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమని సుప్రీంకోర్టు పేర్కొంది.
 
మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలైన జులైలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.మహారాష్ట్ర అసెంబ్లీలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు వికృతంగా ప్రవర్తించినందున వారిని సంవత్సరం పాటు స్పీకర్ ఇన్ ఛైర్ భాస్కర్ జాదవ్ సస్పెండ్ చేశారు.
 
ప్రస్తుతం జరిగిన వర్షాకాల సమావేశానికి (జూలై 2) మాత్రమే సస్పెన్షన్ విధించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.సస్పెండ్ అయిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో సంజయ్ కుటే, ఆశిష్ షెలార్, అభిమన్యు పవార్, గిరీష్ మహాజన్, అతుల్ భత్కల్కర్, పరాగ్ అలవ్ని, హరీష్ పింపాలే, రామ్ సత్పుటే, విజయ్ కుమార్ రావల్, యోగేష్ సాగర్, నారాయణ్ కుచే, కీర్తికుమార్ బంగ్డియాలు ఉన్నారు.