బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్

ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా ప్రధాన పార్టీకు చెందిన నేతలు జోరుగా పార్టీలు మారుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ కు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా లేఖ పంపారు. ఆర్పీఎన్ సింగ్ పార్టీని వీడటం కాంగ్రెస్ కు గట్టి షాక్ అని చెప్పవచ్చు. కాంగ్రెస్ కు యూపీలో కీలక నేతగా ఉన్నారు.
 
తన రాజీనామాను ప్రకటించిన గంటల వ్యవధిలోనే కేంద్ర మంత్రి, యూపీ బీజేపీ ఇంఛార్జ్ ధర్మేంద్ర ప్రదాన్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్‌పీఎన్ సింగ్ కాంగ్రెస్ లో తాను 32ఏళ్లు ఉన్నానని, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గతంలో మాదిరిగా లేదని విమర్శించారు. దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ కన్న కలల్ని సాకారం చేసేందుకు బీజేపీలో కార్యకర్తలా పనిచేస్తానని తెలిపారు. 
 
అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని ఆర్పీఎన్ సింగ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ”రిపబ్లిక్ డే ఫార్మెషన్ రోజే నేను నా రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. జై హింద్” అని పేర్కొన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఆయన అసంతృప్తితో ఉండటం, కనీసం తన సన్నిహితులకు కూడా యూపీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు ఇవ్వకపోవడం ఆయన రాజీనామాకు దారితీసినట్టు చెబుతున్నారు. ఆర్‌పీఎన్ సింగ్ 1996 నుంచి 2007 వరకూ పడ్రౌనా ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతరం కుషీనగర్ నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్రంలో హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 
 
2014,2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఆసక్తికరంగా, యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 30 మంది స్టార్ క్యాంపెయినర్లలో ఆర్‌పీఎన్ సింగ్ కూడా ఉన్నారు.

ఆర్పీఎన్ సింగ్ ను పద్రౌనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని బిజీపీ యోచిస్తోంది. ఇటీవలే బీజేపీని వీడిన స్వామి ప్రసాద్ మౌర్యను సమాజ్ వాదీ పార్టీ ఇదే స్థానం నుంచి పోటీలో నిలిపింది. ఈ క్రమంలో మౌర్యకు చెక్ పెట్టేందుకు బీజేపీ ఆర్పీఎన్ ను రంగంలోకి దింపనుంది.