కరోనా బాధితుల పరిహారంపై `మహా’ ప్రభుత్వంను నిలదీసిన హైకోర్టు

కరోనా  బాధిత కుటుంబాలను ఆఫ్‌లైన్‌లో ఎక్స్ గ్రేషియా క్లెయిమ్ చేయకుండా చేసినందుకు బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. పరిహారం కోసం సాంకేతికత ఆధారిత ప్రక్రియను రూపొందించడంలో ఉన్న తర్కాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా  బాధితుల కుటుంబాలు భౌతికంగా లేదా పోస్ట్ ద్వారా పత్రాలను సమర్పించేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి సూచించింది.
ప్రమేయ వెల్ఫేర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ విషయం చెప్పింది. అటువంటి క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోలేకపోయినందున రూ. 50,000 పరిహారం కోరుతూ 56 మంది దరఖాస్తుదారులకు పిటిషనర్ ప్రాతినిధ్యం వహించారు.
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా కరోనా బాధితులపై ఆధారపడిన వారికి పరిహారం పంపిణీ చేయడానికి మహారాష్ట్రకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మార్గదర్శకాలను రూపొందించిందని పేర్కొన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పిటిషనర్లు ధర్మాసనానికి తెలియజేశారు.
 వాదనలు విన్న తర్వాత, ప్రధాన న్యాయమూర్తి దత్తా ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతూ.. సుప్రీం కోర్ట్ ఆర్డర్ అంటే ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం ఇవ్వండి. ఇంత టెక్నికల్‌గా ఎందుకు వెనకబడి ఉన్నారు’’ అని సీజే దత్తా ప్రశ్నించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం క్లెయిమ్‌లు, చెల్లింపుల కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించక ముందే అనేక చాల్‌లు, స్లమ్ ఏరియాల్లో క్లెయిమ్ ఫారమ్‌లు పంపిణీ జరిగింది.  దీని తర్వాత ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన 56 మంది కలెక్టర్ కార్యాలయంలో క్లెయిమ్‌లు దాఖలు చేశారని పిటిషన్ పేర్కొంది.
సాంకేతిక లోపాల కారణంగా ఆన్‌లైన్ ఫారమ్‌లను అప్‌లోడ్ చేయడం సాధ్యం కాదని, అందువల్ల భౌతికంగా దాఖలు చేసిన క్లెయిమ్‌లను మంజూరు చేయాలని ధర్మాసనం పేర్కొంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారు స్వీకరించిన 30,000 దరఖాస్తులలో  పౌర అధికారం దాదాపు 15,000 దరఖాస్తులను ఆమోదించింది.
ఇంతలో ప్రభుత్వ ప్లీడర్ మాట్లాడుతూ ఆన్‌లైన్ పోర్టల్ మొత్తం నేరుగా లబ్ధిదారునికి చెల్లించేలా చూసేందుకు మాత్రమే ఏర్పాటు చేయబడిందని, అందుకే ఎన్‌జిఓ క్లెయిమ్‌ల సమర్పణలో సహాయం చేసే స్థితిలో లేదని పేర్కొన్నారు. ఈ విషయమై అధికారుల నుంచి ఆదేశాలు తీసుకునేందుకు సమయం కావాలని ప్రభుత్వ ప్లీడర్ కోరారు. తదుపరి విచారణను జనవరి 27కి ధర్మాసనం వాయిదా వేసింది.