స్వేచ్ఛా భారతంపై నమ్మకం నింపిన నేతాజీ

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ భారత దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్రాలు  లభిస్తాయనే నమ్మకాన్ని నింపారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఆదివారం సాయంత్రం ఆవిష్కరించిన అనంతరం మోదీ మాట్లాడుతూ, ఈ విగ్రహం దేశం పట్ల  మన కర్తవ్యాలను గుర్తు చేయడం మాత్రమే కాకుండా రాబోయే తరాలకు ప్రేరణనిస్తుందని తెలిపారు.
‘‘నేను స్వతంత్రాన్ని భిక్షగా తీసుకోబోను, నేను దాన్ని సాధించుకుని తీరుతాను’’ అని నేతాజీ చెప్పారని ప్రధాని గుర్తు చేసారు.  నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన రోజు చరిత్రాత్మకమైనదని చెప్పారు. ఆయన బ్రిటిషర్ల ముందు తల వంచడానికి నిరాకరించారని తెలిపారు. ఇది చరిత్రాత్మక ప్రదేశం, చరిత్రాత్మక సందర్భం అని పేర్కొన్నారు.
”దేశ ప్రజలందరికీ పరాక్రమ్‌ దివస్‌ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నా గౌరవప్రదమైన నివాళులు. మన దేశానికి ఆయన చేసిన సేవలకు ప్రతి భారతీయుడు గర్విస్తాడు” అని పేర్కొన్నారు.
 ‘‘చేయగలం, చేస్తాం’’ అనే నేతాజీ నినాదం నుంచి స్ఫూర్తిని పొందుతూ మనం ముందుకెళ్ళాలని మోదీ పిలుపిచ్చారు.  ఆయన విగ్రహం ప్రజాస్వామిక విలువలు, భావి తరాలను ప్రేరేపిస్తుందని చెప్పారు. నేతాజీ గ్రానైట్ విగ్రహం తయారైన వెంటనే ఈ హోలోగ్రామ్ విగ్రహానికి బదులుగా స్థాపిస్తామని చెప్పారు.
 స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత దేశ సంస్కృతి, విలువలను పరిరక్షించడానికి బదులు ఎందరో మహానుభావుల త్యాగాలు, సేవలను తక్కువ చేసి చూపించడానికి గత ప్రభుత్వం ఎంతో ప్రయత్నించిందని, గతంలో చేసిన తప్పులను ఇప్పుడు తాము సరిదిద్దుతున్నామని, దీన్ని ఎవరూ ఆపలేరని అంటూ ప్రధాని పరోక్షంగా కాంగ్రెస్‌ను దృష్టిలో పెట్టుకుని విరుచుకు పడ్డారు.
భారత దేశ గుర్తింపును, స్ఫూర్తిని పునరుద్ధరించాలన్న లక్షంతోనే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన  స్పష్టం చేశారు. 2047లో స్వాతంత్య్ర శతవార్షికోత్సవం జరగనుందని, దాని కన్నా ముందుగానే నవభారత నిర్మాణ లక్షాన్ని సాధిస్తామని, ప్రపంచంలో ఏశక్తి దీన్ని అడ్డుకోలేదని ఆయన పేర్కొన్నారు.
నేతాజీ ఆశయాలైన చేయగలం, చేస్తాం అనే ధైర్యసాహసాలతో ప్రతివా రూ స్ఫూర్తి పొందాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారత స్వాతంత్య్ర పోరాటం లక్షలాది మంది బలిదానమని, కానీ ఆ చరిత్రను పరిమితం చేయడానికి ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. 
విగ్రహం పూర్తయ్యేవరకే ఈ హోలోగ్రామ్ ఉంటుందని, విగ్రహం పూర్తయిన తరువాత హోలోగ్రామ్ స్థానంలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పారు. ఈ విగ్ర హం కేవలం కర్తవ్యాలను మాత్రమే తెలియచేయకుండా భావి తరాలకు నిరంతరాయంగా స్ఫూర్తిని అందిస్తుందని పేర్కొన్నారు. స్వేచ్ఛాభారతంపై నేతాజీ నమ్మకం కలిగించారని చెప్పారు. ఈ హోలోగ్రామ్ విగ్రహం 28 అడుగుల ఎత్తున, 6 అడుగుల వెడల్పులో నిర్మాణమైంది.
కార్యక్రమంలో 2019, 2020, 2021,2022 సంవత్సరాలకు గాను సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ కు సంబంధించి మొత్తం ఏడు అవార్డులను ప్రధాని బహూకరించారు. గతంలో విపత్తు నిర్వహణ అనేది వ్యవసాయం కింద ఉండేదని, కానీ తమ ప్రభుత్వం ఎన్డీఆర్‌ఎఫ్‌ను మరింత పటిష్ఠం చేసిందని గుర్తు చేశారు. అనేక అంతర్జాతీయ సంస్థలు విపత్తు నిర్వహణ సెక్టార్‌ను చూసి ప్రశంసలు కురిపించాయని పేర్కొన్నారు.
 
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఇవి కేవలం ఓ విగ్రహం కాదని, భారత దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన నేతాజీకి తగిన నివాళి అని తెలిపారు.