బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యులు & తమిళనాడు ఇన్ ఛార్జ్
ఆయన ఉత్తేజభరితమైన నాయకత్వం కేవలం భారత దేశంకే కాదు ప్రపంచంలోని సుమారు 60 దేశాలు దాదాపు ఒకే సమయంలో స్వతంత్రం పొందడానికి స్ఫూర్తి ఇచ్చారు. నేతాజీ పిలుపుతో వేలాది మంది యువకులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక మహోన్నతమైన సైన్యాన్ని సృష్టించాడు.
నేతాజీ 1897లో ఒడిశాలోని కటక్లో జన్మించారు. కోల్కతా నుండి పట్టభద్రుడయ్యారు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసిఎస్) అధికారి కావడం ద్వారా తన సత్తాను నిరూపించుకున్నారు. కానీ అతను తన ఉద్యోగంతో వచ్చిన సౌకర్యాలు, హోదాతో కూడిన జీవితానికి అలవాటుపడలేదు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని మనస్పూర్తిగా స్వీకరించడమే కాకుండా, తన వ్యక్తిగత సౌఖ్యాలు, కుటుంబ బాంధవ్యాలను కూడా వదులుకున్నారు.
“నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను” అనే నినాదంతో దేశ ప్రజలను జాగృతం చేశారు. ఆయన దార్శనికత, వ్యక్తిత్వం, తేజస్సు అటువంటిది. అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ పొంది, ప్రజలకు “నేతాజీ” గా మారారు.
ఆయనకు భారత మాత పట్ల ఎంతటి అభిమానమంటే తన దేశ బానిసత్వపు సంకెళ్లతో బంధించి ఉండగా తానెట్లా ప్రశాంతంగా జీవించగలనని తీవ్ర వ్యధకు గురయి, బ్రిటిష్ పాలకులపై యుద్దాన్ని నిర్భయంగా ప్రకటించారు.
వివిధ సందర్భాలలో దేశ సరిహద్దులకు చాలా దూరంగా ఉన్నప్పటికీ ప్రజల మనస్సులకు మాత్రం దూరం కాలేదు. అందుకే కీలకమైన దేశాల అధినేతలు ఆయనకు అండగా నిలిచారు. నేతాజీ భారతదేశ తీరాన్ని దాటి స్వాతంత్య్ర పోరాట జ్యోతిని వెలిగించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ)పేరుతో యుద్దభూమిలోకి ఒక సైన్యంతో దిగి బ్రిటిష్ పాలకులకు నిద్రను కరువు చేశారు. డిల్లీ ఛలో నినాదాన్ని అందించారు. ఆయన నిర్మించిన 60,000 మంది సైన్యంలోని వేలాది సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు.
“విజయం ఎల్లప్పుడూ వైఫల్యాల స్తంభంపైనే నిలుస్తుంది” అనే జీవిత సత్యం ఆయనను ప్రభావితం చేసింది. అందుకనే తాత్కాలిక అపజయాలతో ఆయన ఎన్నడూ నిరాశ చెందలేదు. తన స్వాతంత్య్ర కాంక్ష నుండి వెనుకడుగు వేయలేదు. నేతాజీ అనేక సార్లు వైఫల్యాలను ఎదుర్కొన్నారు, కానీ ఆ వైఫల్యాలనే ఆయన తన పోరాటంతో విజయంగా మార్చుకున్నారు.
మునిసిపల్ రాజకీయాలైనా, సాధారణ కాంగ్రెస్వాది నుండి కాంగ్రెస్ అధ్యక్షుడి స్థానానికి ప్రయాణం అయినా, ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటు అయినా లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ పోరాటం అయినా, ఆయన ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. బోస్ మహాత్మా గాంధీ ని అభిమానించారు, నాయకత్వాన్ని అంగీకరించారు, అయితే ఆయన కాంగ్రెస్ను విడిచిపెట్టడానికి గాంధీజీయే కారణం అయ్యారు.
ఆ నాడు భారత స్వాతంత్య్ర పోరాటంలో తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్న మహాత్మా గాంధీ నిలబెట్టిన అభ్యర్థి పట్టాభి సీతారామయ్య పై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీచేసి, గెలుపొందడం సాధారణ విషయం కాదు. అది ఆయన పట్టుదలను, సాధారణ ప్రజలలో – ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలలో ఆయన నాయకత్వం పట్ల గల నమ్మకాన్ని వెల్లడిస్తుంది. త్రిపురి కాంగ్రెస్ సమావేశం మార్చి 4 – 11, 1939 వరకు జబల్పూర్లో జరిగింది. ఆరోగ్యం బాగా లేకపోయినా నేతాజీ ఇందులో పాల్గొనేందుకు స్ట్రెచర్పై వచ్చారు. ఇది వారి నిబద్ధతను స్పష్టం చేస్తుంది.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, క్లెమెంట్ అట్లీ బ్రిటిష్ ప్రధాన మంత్రి. అతను 1956లో కోల్కతాకు వచ్చాడు. ఆ సమయంలో, అతనికి ఆతిధ్యం ఇచ్చిన గవర్నర్, మాజీ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిబి చక్రవర్తి, భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలనే బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏమిటో అతని నుండి తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
ఆర్సి మజుందార్ రాసిన “ఎ హిస్టరీ ఆఫ్ బెంగాల్” పుస్తకంలో జస్టిస్ చక్రవర్తి పబ్లిషర్కు రాసిన లేఖ గురించిన ఈ ప్రస్తావన ఉంది.
సుభాష్ చంద్రబోస్ తన సహచరులకు ఇచ్చిన సందేశం “విజయం దూరం కావచ్చు, కానీ అది అత్యవసరం”. అనేది వారిలో ఎంతో స్ఫూర్తినిచ్చింది.
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి భగవద్గీత గొప్ప ప్రేరణ అని సుభాష్ చంద్రబోస్ విశ్వసించారు. సార్వత్రికతపై స్వామి వివేకానంద బోధనలు, ఆయన వ్యక్తపరచిన జాతీయవాద ఆలోచనలు, సామాజిక సేవ, సంస్కరణలపై ధృడమైన విశ్వాసాలు అన్ని నేతాజీని విశేషంగా ప్రేరేపించాయి.
కొంతమంది రచయితలు హిందూ ఆధ్యాత్మికత నేతాజీ రాజకీయ మరియు సామాజిక ఆలోచనలో ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తున్నారు. చరిత్రకారుడు లియోనార్డ్ గోర్డాన్ వివరించినట్లుగా, “అంతర్గత మతపరమైన అన్వేషణలు అతని వయోజన జీవితంలో ఒక భాగంగా కొనసాగాయి. ఇది అతనిని భారత భూదృశ్యాన్ని చుట్టుముట్టి నెమ్మదిగా పెరుగుతున్న నాస్తిక సోషలిస్టులు, కమ్యూనిస్టుల నుండి వేరు చేసింది.”
1930లో కలకత్తాలో చేసిన ప్రసంగంలో బోస్ “ఆధునిక ఐరోపాలో సోషలిజం, ఫాసిజం అని పిలిచే వాటి సంశ్లేషణ కోసం మొదట తన ప్రాధాన్యతను వ్యక్తం చేశాడు. తర్వాత బోస్ కమ్యూనిజం, ఫాసిజం మధ్య “మధ్య మార్గం లేదు” అనే నెహ్రూ 1933లో చేసిన ప్రకటనను “ప్రాథమికంగా తప్పు” అని అభివర్ణించాడు. “జాతీయవాదం, మతాన్ని తిరస్కరించడం వల్ల భారతదేశంలో కమ్యూనిజం ప్రాబల్యం పొందలేకపోవచ్చని బోస్ విశ్వసించారు.
నేతాజీ సేవలను దేశం నిత్యం స్మరించుకుంటూ ఉన్నది. వారి జీవితం దేశ భవిష్యత్తు తరాలకు నిత్య స్ఫూర్తిదాయకం,
మార్గదర్శకం, ఆదర్శవంతం అవుతున్నది.
More Stories
ఈడీ దాడులతో ప్రజలలో మార్పు రాకూడదు
బాధితులపైనే హత్యాయత్నం కేసు నమోదు
తెలంగాణాలో పెరుగుతున్న హిందువులపై దాడులు