వాట్సాప్, టెలిగ్రామ్ వాడకంపై ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక

ఇక నుంచి వాట్సాప్, టెలిగ్రామ్  వంటి సోషల్ మీడియా యాప్‌లలో ముఖ్యమైన సమాచారం, పత్రాలను షేర్ చేయడం సురక్షితం కాదని కేంద్ర ప్రభుత్వం తన అధికారులను హెచ్చరించింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, కేంద్రం కొత్తగా కమ్యూనికేషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవడానికి వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా యాప్‌లను అస్సలు ఉపయోగించవద్దని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులందరినీ ఆదేశించింది.  ఈ సోషల్ మీడియా యాప్‌ల సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థల యాజమాన్యంలో ఉన్నాయని తెలిపింది.
అందుకే దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని భారత వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయవచ్చు అని హెచ్చరించింది.  ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తూ ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సాధనాల ద్వారా మాత్రమే కనెక్ట్ కావాలని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నట్లు వార్తా సంస్థ ఐఎఎన్ఎస్ తెలిపింది.
ఈ ఆర్డర్ అమెజాన్ అలెక్సా, యాపిల్ హోమ్ పాడ్, గూగుల్ మీట్, జూమ్ మొదలైన వాటికి కూడా ఈ నిబందనలు వర్తిస్తాయని తెలిపింది. ప్రస్తుత వ్యవస్థలోని లొసుగులను విశ్లేషించిన తర్వాత వాట్సాప్, టెలిగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్‌లను వాడవద్దు అని కేంద్రం ఆర్డర్ జారీ చేసింది.
ప్రభుత్వానికి చెందిన రహస్య సమాచార లీక్ కావడం, జాతీయ కమ్యూనికేషన్ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలను ఈ యాప్స్ నిరంతరం ఉల్లంఘించిన ఫలితంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రూపొందించిన ఆదేశాలను కేంద్రం విడుదల చేసింది. ఈ ఆదేశాలను అన్నీ మంత్రిత్వ శాఖల అధికారులు పాటించాలని సూచించింది.
గోప్యమైన లేదా జాతీయ భద్రతా సంబంధిత సమస్యలను చర్చించే సమావేశాల సమయంలో స్మార్ట్-వాచీలు, స్మార్ట్ ఫోన్లను ఉపయోగించవద్దని కేంద్రం ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలు వర్చువల్ సమావేశాల కూడా వర్తిస్తుంది అని తెలిపింది.
డిపార్ట్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్(సి-డిఎసి), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) ఏర్పాటు చేసిన మద్యమాల ద్వారా మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ జరపాలని కేంద్రం పేర్కొంది.