టెన్నిస్ క్రీడల నుండి సానియా మీర్జా నిష్క్రమణ 

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాను ఇక ఈ క్రీడా పోటీల నుండి నిష్క్రమిస్తున్నల్టు ప్రకటించారు.  2022 సీజన్ తనకు చివరిదని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ లో ఓటమి తర్వాత సానియా మీర్జా ఈ విషయాన్ని వెల్లడించింది.
సానియా, ఉక్రెయిన్ భాగస్వామి నదియా కిచ్నోక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్‌సెక్‌-కాజా జువాన్‌ జోడీ 4-6, 6-7(5)తో గంటా 37 నిమిషాల్లో ఓటమి చవిచూశారు. అయితే సానియా ప్రస్తుతం అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి ఈ గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో పాల్గొంటుంది.
ఈసంద‌ర్భంగా సానియా మీర్జా మాట్లాడుతూ… ‘ఇది నా చివరి సీజన్ అని నేను నిర్ణయించుకున్నాను. నేను ఒక వారం నుంచి ఈ టోర్నీలో ఆడుతున్నాను. నేను మొత్తం సీజన్‌లో ఆడగలనో లేదో తెలియదు. కానీ నేను మొత్తం సీజన్‌లో ఉండాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.
ఆస్ట్రేలియా ఓపెన్ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఆమె పేర్కొన్నారు. యూఎస్ ఓపెన్ ఆడాలనుకున్నా..కానీ ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పారు.  సానియా భారతదేశపు అత్యంత విజయవంతమైన మహిళా టెన్నిస్ క్రీడాకారిణి. మహిళల డబుల్స్‌లో ఆమె నంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుకుంది.
కెరీర్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించింది. వీటిలో మూడు టైటిల్స్ మహిళల డబుల్స్‌, మూడు మిక్స్‌డ్ డబుల్స్‌లో గెలుచుకుంది. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో, 2012లో ఫ్రెంచ్ ఓపెన్, 2014లో యూఎస్ ఓపెన్. మహిళల డబుల్స్‌లో 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ట్రోఫీలు సాధించింది.
 2013లో సానియా సింగిల్స్ ఆడటం మానేసింది. అప్పటి నుంచి ఆమె డబుల్స్‌లో మాత్రమే ఆడుతోంది. సింగిల్స్‌లో ఆడుతున్నప్పుడు కూడా సానియా చాలా విజయాలు సాధించింది. చాలా మంది పెద్ద టెన్నిస్ క్రీడాకారులను ఆమె ఓడించి 27వ ర్యాంక్‌కు చేరుకుంది.