సమ్మతి లేకుండా కరోనా టీకా వేయలేం

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఒక వ్యక్తి సమ్మతి లేకుండా కరోనా  టీకా వేయాలని సూచించడం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బలవంతంగా టీకా ఇవ్వడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. 

కొన్ని రకాల సేవలు పొందేందుకు కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించాలన్న నిబంధన నుంచి దివ్యాంగులకు మినహాయింపు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఎలాంటి సేవలు పొందడానికైనా కరోనా  వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేస్తూ ఇప్పటివరకు మార్గదర్శకాలేవీ జారీ చేయలేదని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలియజేసింది. 

ఈ మేరకు ఓ ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది. ఎవారా ఫౌండేషన్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ఇంటింటికి వెళ్లి దివ్యాంగులకు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. కొన్ని సేవలకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరైన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేసింది.

అప్పటివరకు వారికి సర్టిఫికెట్ చూపించాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సర్టిఫికెట్ తప్పనిసరేం కాదని స్పష్టం చేసింది. పైగా వ్యక్తుల సమ్మతి లేకుండా టీకా ఇవ్వలేమని తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి వల్ల నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో అందరూ టీకా వేసుకోవాలని సూచించినట్టు కేంద్రం వివరించింది. ఇది అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రకటన అని పేర్కొంది. అందుకోసం తగిన ఏర్పాట్లు చేశామని, అంతేకానీ బలవంతంగా వ్యాక్సిన్ ఇవ్వడం తమ ఉద్దేశం కాదని పేర్కొంది.