పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20కి వాయిదా

కాంగ్రెస్, బీజేపీ సహా పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారంనాడు ఎన్నికలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది.

ఫిబ్రవరి 16న గురు రవిదాస్ జయంతి ఉంది. దానికి సంబంధించిన ఉత్సవాలు ముందుగానే ప్రారంభమవుతాయి. వేడుకల్లో పాల్గొనేందుకు దాదాపు 20లక్షల మంది భక్తులు పంజాబ్ నుంచి ఉత్తర్ప్రదేశ్లోని వారణాసికి వెళ్తారు. 

దీంతో వారంతా ఫిబ్రవరి 14న జరిగే పోలింగ్ లో ఓటు వేసే అవకాశం కోల్పోతారని అన్ని పార్టీలు ఈసీకి తెలిపాయి. ముఖ్యమంత్రి చరణ్ జీత్ చన్నీ సైతం పోలింగ్ ను వారం పాటు వాయిదా వేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్ర జనాభాలో 32 శాతం ఎస్‌సి కమ్యూనిటీ ప్రాతినిథ్యం వహిస్తున్నందున పోలింగ్‌ను కనీసం ఆరురోజులకి వాయిదా వేయాల్సిందిగా కోరుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.ఈ క్రమంలో ఢిల్లీలో సమావేశమైన కేంద్ర ఎన్నికల కమిషన్ పార్టీల అభ్యర్థన మేరకు పోలింగ్ వాయిదా వేసింది.