ఎస్పీ కార్యాలయంలో జనం రద్దీపై ఈసీ ఆగ్రహం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో నగరంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో జనం రద్దీపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని పార్టీలోకి ఇద్దరు మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ, కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలను స్వాగతించే కార్యక్రమంలో భారీ జనసమూహం కనిపించింది.
కరోనా  నిబంధనలను ఉల్లంఘించి భారీగా జనం పార్టీ కార్యాలయానికి వచ్చారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశంతో గౌతమ్ పల్లి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జిని సస్పెండ్ చేసింది. కరోనా-సంబంధిత నిబంధనలను ఉల్లంఘించి శుక్రవారం లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో భారీ సభపై ఇద్దరు సీనియర్ అధికారుల నుంచి ఈసీ వివరణ కోరింది.
కరోనా ప్రోటోకాల్‌లను ఉల్లంఘించిన దృష్ట్యా ఇన్‌చార్జి దినేష్ సింగ్ బిష్త్ విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించినందున తక్షణమే అతన్ని సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు.అంతేకాకుండా శనివారం ఉదయం 11 గంటలలోపు ఏసీపీ (లక్నో) అఖిలేష్ సింగ్, అడిషనల్ సిటీ మేజిస్టేట్ (ఫస్ట్) గోవింద్ మౌర్యాలను కూడా కమిషన్ వివరణ కోరింది.
పోలీసు స్టేషన్‌లో 2,500 మంది సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో  కార్యకర్తలపై కేసు కూడా నమోదు చేశారు. 2,500 మంది ఎస్పీ కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యాలయం చుట్టూ అడ్డంగా వాహనాలను పార్కింగ్ చేసి, చట్టవిరుద్ధంగా సమావేశాన్ని నిర్వహించడం ద్వారా రహదారిని అడ్డుకున్నారని సబ్-ఇన్‌స్పెక్టర్ తన ఫిర్యాదులో ఆరోపించారని పోలీసు కమిషనర్ ఠాకూర్ తెలిపారు.పోలీస్ కమిషనర్ (లక్నో) డికె ఠాకూర్ స్టేషన్ అధికారిని సస్పెండ్ చేసినట్లు ధృవీకరించారు.
దళితులను ఓటుబ్యాంక్ గానే చూస్తున్న అఖిలేష్ 
 
మరోవంక, అఖిలేష్ యాదవ్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన భీం ఆర్మీ 24 గంటలకు గడవక ముందే యూటర్న్ తీసుకుంది. దళితులను అఖిలేష్ కేవలం ఓట్ బ్యాంక్‌గానే చూస్తున్నారని, వారిని ఎన్నికల బరిలోకి ఆహ్వానించడం లేదని భీంఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ ధ్వజమెత్తారు. 
 
 దీనికి ముందు బీజేపీని ఓడించాలంటే ఐక్యత చాలా ముఖ్యమని, అందుకు అఖిలేష్‌ కూటమికి తాము మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు.  
 
 ‘‘ఆరు నెలలుగా అఖిలేష్ యాదవ్‌తో ఎన్నికల పొత్తు గురించి ఎదురుచూస్తున్నాను. అయితే అది మంచి ఫలితాలను ఇవ్వలేదు. వారు దళితుల నుంచి నాయకత్వాన్ని ఇష్ట పడడం లేదు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు’’ అని చంద్రశేఖర్ మండిపడ్డారు.