ఫిరాయింపు దారులు అఖిలేష్ కు తలనొప్పి కానున్నారా!

వరుసగా ముగ్గురు మంత్రులతో సహా దాదాపు పది మంది బిజెపి ఎమ్యెల్యేలు ఆ పార్టీని వీడటం, వారిలో చాలామందివరకు తన పార్టీలో చేరుతుండడంతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత , ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లో ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. 
 
తిరిగి యోగి ఆదిత్యనాథ్ సారధ్యంలో బిజెపి అధికారంలోకి రాబోతున్నట్లు చెబుతున్న పోల్ సర్వేలు అన్ని అబద్దాలని తేలుతాయని అంటున్నారు. తానే అధికారంలోకి రాబోతున్నట్లు సంబరపడిపోతున్నారు.  అయితే ఆ విధంగా బిజెపిని వీడుతున్న వారిలో చాలామంది వ్యక్తిగత కారణాల వల్లనే వీడుతున్నారు.
తమకు తిరిగి సీట్ ఇవ్వరనో, తమ కుటుంభం సభ్యులకు అడిగిన సీట్లు ఇవ్వడం లేదనో వ్యక్తిగత అజెండాలతోనే పార్టీ మారుతున్నారు. ఆ విధంగా ఎన్నికల ముందు పార్టీ మారిని వారందికీ సీట్లు ఇచ్చి, మొదటినుండి పార్టీలో ఉన్నవారిని కాదని పశ్చిమ బెంగాల్ బెంగాల్ ఎన్నికలలో బిజెపి భారీ మూల్యం చెల్లింపవలసి రావడం గమనార్హం.
 
ఇప్పటికే సొంతపార్టీలో ప్రతి నియోజకవర్గంలో పలువురు సీట్లు ఆశిస్తున్నారు. వారికి సర్దుబాటు చేయడమే కష్టంగా ఉండగా, కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఇవ్వడం సమస్యగా మారే అవకాశం ఉంది. ఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు ఇప్పటికే ఏడు పార్టీలు ముందుకొచ్చాయి.
ఇందులో రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ), మహాన్‌దళ్, జన్‌వాదీ పార్టీ (సోషలిస్టు), కృష్ణ పటేల్‌ నేతృత్వంలోని ఆప్నాదళ్, సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ, ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ, గంద్వానా గణతంత్ర పార్టీలు ఉన్నాయి. వారికి సీట్లు సర్దుబాటు చేయడం ఒక సమస్యగా ఉండగా, ఇప్పుడు కొత్త సమస్య ఎదుర్కొంటున్నారు.
 
2017 ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ 1.78 శాతం ఓట్లతో ఒక ఎమ్యెల్యే సీట్ గెల్చుకుంది. ఈ ఏడాది పొత్తుల కారణంగా కనీసంగా 40–50 స్థానాలకు పోటీ చేయాలని భావిస్తోంది. ఇక 30–35 స్థానాల్లో ప్రభావం చూపగల సుహెల్‌వేద్‌ పార్టీ నేత ఓంప్రకాశ్‌ రాజ్‌బర్‌ అఖిలేశ్‌ 20 నుండి 25 సీట్లు కోరుతున్నారు. ఈ పార్టీకి గత ఎన్నికలలో 0.70 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.  మహాన్‌దళ్‌ నేత కేశవ్‌దేవ్‌ మౌర్యకు 2- 3 సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగినా, అవి కొలిక్కిరాలేదు.మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపు ఒక తలనొప్పిగా ఉండగా, మరోపక్క కొత్తగా చేర్చుకుంటున్న నేతలకు టికెట్‌లు ఇవ్వడం అఖిలేశ్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. ముఖ్యంగా ఇటీవలే బీజేపీ నుంచి ఎస్పీలో చేరిన మాజీ మంత్రి, ఓబీసీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్య ఫాజిల్‌నగర్‌ నుంచి పోటీ చేసేందుకు సిద్దపడుతున్నారు.
అయితే ఈ టికెట్‌ను బీజేపీ నుంచి ఆర్‌ఎల్‌డీలో చేరిన ఆమ్‌శీష్‌ రాయ్‌కు ఇస్తామని ఇప్పటికే ఆర్‌ఎల్‌డీ నేత జయంత్‌ చౌదరీ వాగ్దానం చేశారు. దీంతో ఈ సీటు కేటాయింపు చిక్కుల్లో పడింది. ఇక మౌర్య కుమారుడు ఉత్క్రిష్ట్‌ మౌర్య 2017లో ఊంచహార్‌ నుంచి పోటీ చేసి ఎస్పీ అభ్యర్ధి  మనోజ్‌ పాండేపై ఓడిపోయారు. ఇప్పుడు ఈ స్థానాన్ని మౌర్య పట్టుబడుతుండటంతో మనోజ్‌ను ఒప్పించడం అఖిలేశ్‌కు క్లిష్టంగా మారింది.
ఇక మహానదళ్‌ నేత కేశవ్‌ మౌర్య కుమారుడు చంద్ర ప్రకాష్‌ మౌర్య ఇప్పటికే బిల్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. అయితే బిల్సీ బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆర్కే శర్మ కొద్ది రోజుల క్రితం ఎస్పీలో చేరడంతో అభ్యర్థి ఎంపిక కష్టంగా మారింది.
వీరితో పాటే మంత్రి పదవి వదులుకొని ఎస్పీలోకి వస్తున్న దారాసింగ్‌ చౌహాన్‌ మధుబన్‌ నియోజకవర్గంతో పాటు మవూ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు తన మద్దతుదారులకు కోరుతున్నారు. ఇక పశ్చిమ యూపీలో ఎస్పీలో చేరిన కాంగ్రెస్‌ నేత ఇమ్రాన్‌ మసూద్‌ సైతం తన మద్దతుదారులకు 6–8 సీట్లు కోరుతున్నారు.
టికెట్‌లు దక్కవనే అంచనాతో బీజేపీ, బీఎస్పీ నుంచి కొత్తగా పార్టీలో చేరిన బ్రాహ్మణ నేతలు తమకు టిక్కెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సామాజిక బలాలను దృష్టిలో పెట్టుకొని, పొత్తులకు గౌరవమిస్తూ, కొత్తవారికి టికెట్లు కేటాయించడం, సీట్లు సర్దుబాటు చేయడం అఖిలేశ్‌ కు పెద్ద సవాల్ గా మారనుంది.