ఎరువుల ధరలపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాయడం విడ్డూరంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు ఎరువుల కోసం రైతులు క్యూల్లో నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నారని కేసీఆర్ కు వ్రాసిన లేఖలో గుర్తుచేశారు. మోదీ సర్కారు వచ్చాక రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు అందుతున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు.
రాష్ట్రంలో రైతులకు ఎరువులను ఉచితంగా ఇస్తామంటూ 2017లో హామీ ఇచ్చిన కేసీఆర్.. ఐదేళ్లయినా దాన్ని అమలు చేయలేదని గుర్తు చేశారు. మాట తప్పినందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధు ఒక్కటి ఇచ్చి ఇతర రాయితీలన్నీ ఎత్తేసిన కేసీఆర్.. రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదని పేర్కొమన్నారు.
జీవో 317 నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలతో ప్రధానమంత్రికి లేఖ రాశారని సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కన్నీళ్లతో చకినాల పిండి తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని సంజయ్ విమర్శించారు. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాల్సిన రైతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలు రోదిస్తున్నాయని ఆయన చెప్పారు.
రైతులకు ఉచితంగా ఎరువులు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రూ.లక్ష రుణమాఫీని ఉగాదిలోగా అమలు చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు. లేకుంటే మహోద్యమం చేపడతామని హెచ్చరించారు. డిస్కమ్లను అప్పుల్లో ముంచిన సీఎం.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
‘‘రాష్ట్రంలో గత మూడేళ్లలో ఒక్క రైతు మోటారుకు మీటరు బిగించినట్లు నిరూపించగలరా? నిరూపించకపోతే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా?’’ అని సంజయ్ సవాల్ చేశారు. ‘‘ఎరువుల సబ్సిడీ పేరిట తెలంగాణ రాష్ట్రానికి ఏడేళ్లలో కేంద్రం వేల కోట్లు ఖర్చు చేసింది నిజం కాదా? మీరు చేసిందేమిటి?’’ అని నిలదీశారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరకుల కొరత వల్ల ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగినా వీటిని కేంద్రం పాత ధరలకే సరఫరా చేస్తోందని సంజయ్ గుర్తుచేశారు. 2014తో పోలిస్తే ప్రస్తుతం వరి, గోధుమలు సహా 23 రకాల పంటలకు ఇస్తున్న కనీస మద్దతు ధర 50-100 శాతం పెరిగిందని వివరించారు. పొరుగు రాష్ట్రాలు రైతులకు బోనస్ పేరిట క్వింటాకు రూ.200-600 వరకు చెల్లిస్తుండగా.. తెలంగాణలో నయాపైసా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించేందుకు కేంద్రం శివరాజ్సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క సిఫారసూ ఎందుకు చేయలేదని సంజయ్ నిలదీశారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై మాట్లాడే అర్హత కేసీఆర్కు లేదని అంటూ కేంద్రం పెట్రోలు, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. 19 రాష్ట్రాలూ పన్నులు తగ్గించాయి. తెలంగాణలో మాత్రం పైసా కూడా తగ్గించలేదని గుర్తు చేశారు.
ఏడేళ్లుగా పంట బీమాను అమలు చేయలేదన్నారు. రైతుల పాలిట రాబందుగా మారిన కేసీఆర్ రైతుబంధునంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ‘‘మీరు నిజంగా రైతుబంధే అయితే అన్నదాతల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఎందుకుంది? రూ.10 వేల కోట్ల రైతుబంధు నిధులు ఇస్తున్నట్లు చెప్పుకొంటున్న మీరు.. ఊరూరా బెల్ట్షాపులు తెరిచి ఏటా రూ.30 వేల కోట్లు దండుకోవడం లేదా?’’ అని ప్రశ్నించారు.
More Stories
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు
ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్