యుపిలో 172 స్థానాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు

ఉత్తర్ ప్రదేశ్‌లో తొలి దశలలో ఎన్నికలు జరగనున్న 172 అసెంబ్లీ స్థానాలకు బిజెపి గురువారం అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించాలని పార్టీ నిర్ణయించినట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. 
 
వీరితో పాటు మరో ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్‌ను కూడా పోటీలో నిలపాలని బిజెపి భావిస్తోంది. రాష్ట్రంలో తొలి దశలలో జరగనున్న 172 అసెంబ్లీ స్థానాలపై విస్తృతంగా చర్చలు జరిపి పార్టీ అభ్యర్థులను బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య విలేకరులకు తెలిపారు. 
 
అయోధ్య నుంచి యోగి ఆదిత్యనాథ్, సిరథు నుంచి మౌర్య పోటీలో నిలిచే అవకాశం ఉంది. రాష్ట్ర రాజధాని లక్నోలోని ఒక నియోజకవర్గం నుంచి శర్మ పోటీ చేసే అవకాశం ఉంది. మరి కొద్ది రోజుల్లో అభ్యర్థుల తొలి జాబితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వర్గాలు తెలిపాయి.