కర్నూల్ ఎస్పీ, ఆత్మకూర్ ఎమ్యెఏలపై కేసులు పెట్టరే?

కర్నూలు జిల్లా ఆత్మకూరులో బాధితుడయిన తమ పార్టీ అధ్యక్షుడిపైనే కేసులు పెట్టిన పోలీసు ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మసీదు నిర్మాణానికి అనుమతి లేదన్న కర్నూల్ ఎస్పీ,  మసీదు నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యేపై ఎందుకు కేసుపెట్టలేదని ప్రశ్నించారు. 

ఆత్మకూరు సంఘటనలో ప్రభుత్వం ముద్దాయి అని ఆరోపిస్తూ, ఆత్మకూరు ఘటనలో పోలీసులపై కూడా దాడి జరిగింది వాస్తవం కాదా? అని నిలదీశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుని వాహనం దగ్దం చేసి, అతనిని చంపేస్తామని హెచ్చరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. `ఒరేయ్ శ్రీకాంత్ రెడ్డి నిన్న చంపేస్తాం’ అంటూ బెదిరించిన ఆడియో కూడా ఉందని ఆయన తెలిపారు. 

డీఎస్పీ కబురు పెడితేనే శ్రీకాంత్ రెడ్డి కారులో అక్కడకు వెళ్లాడని,  అదే కారులో ప్రెస్ రిపోర్టర్లు కూడా ఉన్నారని వీర్రాజు స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ, డీజీపీ లు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పక్కా ఆధారాలు ఉన్నా శ్రీకాంత్ రెడ్డి పై ఎఫ్.ఐ.ఆర్ ఎలా నమోదు చేశారు? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. 

  ఆత్మకూరు ఘటనలో ప్రధాన ముద్దాయిలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులే అంటూ  ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ప్రధాన ముద్దాయి అని స్పష్టం చేశారు.  అంజాద్ భాషా, ఎమ్మెల్యేలు 144 సెక్షన్ ఉండగా వెళ్లారని చెబుతూ  వారిపైన కేసులు పెట్టకపోతే తాము కూడా ఆత్మకూరు వస్తామని వీర్రాజు హెచ్చరించారు.

 రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ హయాంలో మతతత్వ పాలన కొనసాగుతోందని, గనులన్నీ దోచుకుంటున్నారని వీర్రాజు విరుచుకుపడ్డారు  తప్పుడు ఫిర్యాదులు ఇస్తే విచారించకుండా జైళ్లకు పంపిస్తారా? వైసీపీకి 151 స్థానాలు ఇచ్చింది అరాచక పాలన చేయమనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా పోలీసులపైనే కేసు పెట్టాలని డిమాండ్ చేస్తారా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, మరికొంతమంది కలిసి అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టారని వీర్రాజు ఆరోపించారు. శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ నేతలపై పెట్టిన కేసులు ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఎటువంటి అనుమతి లేకుండా. హిందువుల ఇళ్లమధ్య మసీదు ఎలా కడతారు? అంటూ నిలదీశారు. మసీదుకు అనుమతి లేదని ఒక పక్క ఎస్పీ చెబుతుంటే ఎమ్యెల్యే ఎలా మద్దతు ఇస్తారని  వీర్రాజు ధ్వజమెత్తారు. ఆత్మకూరు పోలీసులు 150 మంది వచ్చారని అంటుంటే డిజిపి 50 మందే వచ్చారనడం హాస్యాస్పదం అని విమరిశలు.

పోలీసువ్యవస్ధను నిర్వీర్యం చేయొద్దని డిజిపికి హితవు చెప్పారు. ఆత్మకూరు లో 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. హిందువుల మధ్య మసీదు ఎలా‌ కడతారు. ఒక మతానికి కొమ్ము కాసేలా ఉన్న వైసీపీ వైఖరిని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అండతో 40 గంటల్లో మసీదు నిర్మాణం చేశారని ఆరోపించారు. ఈ ఘర్షణకు కారణమైన ముస్లీంలు, ఎమ్మెల్యే పైనా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

ఒక్క అవకాశం అని అవకాశం ఇస్తే మానసిక క్షోభకు గురి చేస్తున్నారని బిజెపి నేత మండిపడ్డారు. అదేమని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడ యినా వైసీపీ తీరు మార్చుకోకపోతే.. తాడోపేడో తేల్చుకుంటాం అని హెచ్చరించారు.

సినిమా టిక్కెట్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏమిటి? ఇసుక ధరలు ఎందుకు తగ్గించరు. ప్రజలకు అవసరం లేదా ఇది? అని వీర్రాజు ప్రశ్నించారు. సినిమా టిక్కెట్ ధరలు ఒక్కటి తగ్గించి గొప్పగా చెప్పుకోవడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. మీ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే బస్తా ధరలు తగ్గించవచ్చు కదా? అంటూ నిలదీశారు. 

ధాన్యం కొనేవాళ్లులేక రైతులు గగ్గోలు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వంకు పట్టడం లేదని వీర్రాజు విమర్శించారు.  జగన్ కు దమ్ముంటే రూ 1400కి ధాన్యం కొనుగోలు చేసి చూపించాలని సవాల్ చేశారు.  నిత్యావసర వస్తువలు, ఇసుక, సిమెంట్ ధరలు కూడా తగ్గించు.ఇవన్నీ ప్రజలకు అవసరం లేనివిగా భావిస్తున్నారా? మీ చేతిలో ఉన్న వాటి ధరలు గురించి మాత్రం మాట్లాడరా?  అంటూ ప్రశ్నించారు. 

రెండు కోట్ల మంది ప్రజల గురించి జగన్ ఆలోచించరని ధ్వజమెత్తారు. వేల మంది చూసే సినిమా టిక్కెట్లు తగ్గించి గొప్ప పని చేసినట్లు ప్రగల్భాలు ప్పలుకుతున్నారని, కనీసం సిగ్గు లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని వీర్రాజు ఎద్దేవా చేసారు. గతంలో చంద్రబాబు, నేడు జగన్ లు ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

ఏపీ ప్రజలకు అన్ని విధాలా న్యాయం చేసే ఏకైక పార్టీ బీజేపీనే అని స్పష్టం చేశారు.  గనులను జాతీయం చేస్తే ఏపీ ప్రభుత్వానికి అసలు అప్పులు చేయాల్సిన అసరమే ఉండదని హితవు చెప్పారు. వైయస్ తండ్రి హయాం నుంచి నేటి వరకు గనులను దోచుకుని కోట్లు కూడేసుకున్నారని ఆరోపించారు.

ఎయిడెడ్ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు యత్నించారని మండిపడ్డారు. మంత్రి గారూ.. రాంగోపాల్ వర్మ ను పిలిచి బోజనం పెట్టారు. విద్యార్థుల కడుపు నింపే విషయాన్ని మాత్రం పట్టించుకోరని ఎద్దేవా చేశారు.  బిజేపీని ఓడించినా.. రాష్ట్రం మొత్తం 24 గంటలూ కరెంటును ఇచ్చామని గుర్తు చేశారు.

పౌరసరఫరాల శాఖలో బియ్యం రవాణా అతి పెద్ద కుంభకోణం అని వీర్రాజు ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఓ మంత్రి ఈ డబ్బుతో ఒక ఇల్లే నిర్మించాడని పేర్కొన్నారు. అధికారులు కుర్చీలకు అతుక్కుపోయి దోచుకుంటున్నారని,  వైసీపీ నేతలే బియ్యం అక్రమ రావాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.

ఇటువంటి అక్రమాలను త్వరలోనే బీజేపీ బయట పెడుతుందని వీర్రాజు హెచ్చరించారు. పరిపాలన అంటే ప్రజల సౌభాగ్యాన్ని కోరే విధంగా సాగాలి.