రియల్టర్ అవతారం ఎత్తిన వైసిపి ప్రభుత్వం 

రియల్టర్ అవతారమెత్తి వైసిపి ప్రభుత్వం రాజధాని భూములను స్వాహాచేసే ప్రయత్నం చేస్తున్నదని బిజెపి నేత లంకా దినకర్ ఆరోపించారు.  ప్రభుత్వం ప్లాట్ల అమ్మకం చేపట్టడంతో నవులూరు భూములకు నూకలు చెల్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాట్ల అమ్మకం కోసం బ్రోచర్‍లో సెక్రటేరియట్, హైకోర్టు దూరం తెలిపారని గుర్తు చేశారు. 
 
 హైకోర్టును ప్రస్తావించారంటే అమరావతి ఏకైక రాజధాని అని ఒప్పుకున్నట్లేనా ? మూడు రాజధానులని బొత్సతో మళ్లీ చెప్పించడం మోసం కాదా? సీఆర్‍డీఏలను మళ్లీ బతికించింది భూములు అమ్ముకోవడానికేనా? అని ప్రశ్నించారు. 

అమరావతి “స్మార్ట్ సిటీ” గా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే, “స్మార్ట్ టౌన్ షిప్” కడతా.. రండీ.. కొనండీ అంటున్న జగనన్న. భూములు అమ్మడం కోసం లేఔట్ కి సెక్రటేరియట్ 10 కి.మీ, హై కోర్ట్ 15 కి.మీ దూరం మాత్రమే అంటూ బ్రోచర్ విడుదల చేశారని గుర్తు చేశారు.

అదే సమయంలో మూడు రాజధానులు అని బొత్సాతో మరల చెప్పించడం అంటే, ప్లాట్లు కొనేవారిని మోసం చేయడం కాదా? అని నిలదీశారు. బ్రోచర్లో సెక్రటేరియట్, హై కోర్ట్ దూరం తెలపడం అంటే విశాఖ, కర్నూల్ ప్రజలను కుడా మోసం చేయడం కాదా? అని ధ్వజమెత్తారు. 

జగనన్న మొన్నటి వరకు మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడి, ఇప్పుడు రాజధాని 29 గ్రామాల మధ్య మూడు ముక్కలాట మొదలు పెట్టాడని దినకర్ ఆరోపించారు. 

సీఆర్డిఎని మరల బ్రతికించింది, రాజధాని అమరావతి భూములును అమ్ముకోవడం లేదా అప్పు తెచ్చుకోవడానికా ? అని నిలదీశారు. కేవలం ప్రజల నుండి డబ్బు లాగడానికి, జగన్ తనని తాను మోసం చేసుకుంటూ టోకుగా అన్ని ప్రాంతాల ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు.