ప్రధాని భద్రతా వైఫల్యంపై యుకె సిక్కుల ఆగ్రహం 

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ  పంజాబ్ ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా లోపం కార‌ణంగా ఆయ‌న ప‌ర్య‌ట‌నని ర‌ద్దు చేసుకోవలసి రావడం పట్ల  యూకే కేంద్రంగా ప‌ని చేస్తోన్న బ్రిటీష్ సిక్కు సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.  ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు అంత‌రాయం క‌లిగించిన గ్రూపుల‌ను ఖండిస్తూ  బ్రిటీష్ సిక్కు సంఘం ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుదల చేసింది.

‘మోదీ పర్యటనకు అంతరాయం కలిగించిన కొందరు దారి తప్పిన వ్యక్తులు.. పంజాబ్‌కు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రధాని వచ్చారన్న సంగతిని గుర్తించాలని బ్రిటీష్ సిక్కు సంఘం ఛైర్మన్ లార్డ్ రామి డేంజర్ హితవు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్‌లో రూ.42,750 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించవలసి ఉన్నదని ఆయన గుర్తు చేశారు.

‘‘ ప్రధానమంత్రి భారత ప్రభుత్వానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధిపతి. ఆయన ఒక రాష్ట్రానికి కాకుండా దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తారు. దేశాన్ని నడిపించాల్సిన నాయకుడి అధికారాన్ని ఎవరూ అణగదొక్కకూడదు. ప్రజలను కలవడానికి, పలకరించడానికి తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునేందుకు ఆయన వచ్చారు. కొందరు గుంపు కారణంగా మోదీ పర్యటనకు ఆటంకం కలిగింది” అంటూ ఆ లేఖలో విచారం వ్యక్తం చేశారు.

అదే సమయంలో పార్లమెంట్‌లో తన బలం కోసం ప్రధాని పంజాబ్‌పై మాత్రమే ఆధారపడలేదని బ్రిటీష్ సిక్కు అసోసియేషన్ గుర్తుచేసింది .వాస్తవానికి పంజాబ్ భవిష్యత్తు, అభివృద్ధి ప్రధానమంత్రి చిత్తశుద్ధిపై ఆధారపడి వుంటుందని చెప్పింది. సరిహద్దు రాష్ట్రంగా వున్నందున, ఉగ్రవాదం.. పక్కదేశం సరఫరా చేసే మాదక ద్రవ్యాలపై పోరాడటానికి పంజాబ్‌కు కేంద్రం సహాయం ఆవశ్యకమని బ్రిటీష్ సిక్కు అసోసియేషన్ స్పష్టం చేసింది.

పంజాబ్ నాయకులు ప్రధానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చినందుకు సానుభూతి చూపాలని పిలుపునిచ్చింది. దీనిపై త్వరలోనే వారు తగిన గుణపాఠం నేర్చుకుంటారని అసోసియేషన్ ఆకాంక్షించింది.