12 నుంచి నీట్-పీజీ కౌన్సిలింగ్

నీట్‌-పిజి మెడికల్‌ అడ్మిషన్‌ కౌన్సిలింగ్‌ బుధవారం ప్రారంభమవుతుందని ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్‌ మాండవీయా ఆదివారం తెలిపారు. ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్ల రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థిస్తూ.. మెడికల్‌ కౌన్సిలింగ్‌ చేపట్టేందుకు ఇటీవల అనుమతినిచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది. 
 
కౌన్సిలింగ్‌ తర్వాత సుమారు 45 వేల మంది జూనియర్‌ డాక్టర్లు.. విధుల్లో చేరే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఒమిక్రాన్‌తో పోరాడుతున్న భారత్‌కు ఇది కాస్త ఉపశమనం కావచ్చు. ‘నీట్‌-పిజి కౌన్సిలింగ్‌ను మెడికల్‌ కౌన్సిలింగ్‌ కమిటీ (ఎంసిసి) జనవరి 12 నుండి నిర్వహించనుంది. 
 
రెసిడెంట్‌ వైద్యులకు ఆరోగ్య శాఖ ఇచ్చిన హామీ ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి.. కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నాం. ఈ చర్య కరోనాపై పోరులో దేశానికి మరింత బలం చేకూరుస్తుంది. అభ్యర్థులందరికీ నా శుభాకాంక్షలు’ అని మాండవీయ ట్వీట్‌ చేశారు.
 
ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ల కోటా సబబే అని సుప్రీంకోర్టు పేర్కొంది. 
 
గతంలో మాదిరిగానే క్రిమిలేయర్‌ సంవత్సర ఆదాయం 8 లక్షలలోపు ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తింప చేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి నీట్‌లో 10 శాతం రిజర్వేషన్లు పొందే అవకాశం లభించింది. అడ్మిషన్ ప్రక్రియ చేపట్టడం అత్యవసరమని తెలిపింది.