జిఎస్టి వసూళ్లు వరసగా ఆరో నెలా రూ. లక్ష కోట్లను అధిగమించాయి. డిసెంబర్ నెలలో రూ.1.29 లక్షల కోట్లు వసూలయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 13 శాతం వృద్ధి నమోదయింది. అయితే గత నెలలో నమోదయిన రూ.1.31 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి.
డిసెంబర్ నెలకు గాను రూ.1,29,780 కోట్ల జిఎస్టి వసూలయినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో కేంద్ర జిఎస్టి (సిజిఎస్టి) రూ.22.578 కోట్లు కాగా, రాష్ట్రాల జిఎస్టి (ఎస్జిఎస్టి) రూ.28,658 కోట్లు. సమ్మిళిత జిఎస్టి (ఐజిఎస్టి) కింద రూ.69,155 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.37,527 కోట్లతో కలిపి),సెస్ రూపంలో రూ.9,389 కోట్లు( వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.614 కోట్లతో కలిపి) వసూలయినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
గత ఏడాది నవంబర్తో పోలిస్తే జిఎస్టి వసూళ్లు 13 శాతం, 2019 ఇదే నెలతో పోలిస్తే 26 శాతం పెరిగాయి.2021 ఏప్రిల్లో జిఎస్టి వసూళ్లు జీవనకాల గరిష్ఢ స్థాయిని తాకాయి. ఆ నెలలో రూ.1.41 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇక అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో నెలకు సగటున రూ.1.30 లక్షల కోట్లు వసూలు కావడం గమనార్హం.
ఇక తొలి త్రైమాసికంలో రూ.1.10 లక్షల కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.1.15 లక్షల కోట్లు మాత్రమే సగటున వసూలయ్యాయి. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణతో పాటు పన్ను ఎగవేత నిరోధక చర్యలు ఫలిస్తుండడం వల్లే జిఎస్టి వసూళ్లు పుంజుకుంటున్నాయని ఆర్థిక శాఖ పేర్కొంది.
రేట్ల హేతుబద్ధీకరణ కూడా అందుకు దోహద చేస్తోందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో జిఎస్టి వసూళ్లు ఆశాజనకంగానే ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
More Stories
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం
వచ్చేనెల పిఎం కిసాన్ నిధులు విడుదల
ఢిల్లీ లిక్కర్ కేసు ఛార్జిషీట్లో ఆప్ పేరు