ఆఫ్ఘన్ కు భారత్ 5 లక్షల కరోనా డోసులు

తాలిబాన్ల ఆక్రమణలో అల్లకల్లోలంగా ఆఫ్ఘనిస్తాన్‌ లో ప్రజలను ఆదుకోవడానికి  భారత్ సహాయం అందిస్తూనే ఉంది. కరోనా విలయతాండవంతో అల్లాడుతున్న ఆ దేశానికి తాజాగా 5 లక్షల కోవాక్సిన్ డోసులను సరఫరా చేసింది. గతంలో కూడా వ్యాక్సిన్ డోసులను అందచేసిన భారత్  మరోసారి వ్యాక్సిన్లు అందించి ఆఫ్ఘన్ కు అండగా నిలిచింది. 

వ్యాక్సిన్ డోసులను కాబూల్‌లోని ఇందిరా గాంధీ ఆసుపత్రికి అందజేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా మరో 5,00,000 డోసుల అదనపు వ్యాక్సిన్‌ను రాబోయే వారాల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు సరఫరా చేయనున్నట్లు తెలిపింది. 

కేవలం వ్యాక్సిన్ డోసులను మాత్రమే కాకుండా ఆఫ్ఘన్ ప్రజలకు ఆహార ధాన్యాలు, అవసరమైన ప్రాణాలను రక్షించే మందులను కూడిన అందించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెలలో 1.6 టన్నుల వైద్య పరికరాలను పంపించింది.

రాబోయే వారాల్లో గోధుమల సరఫరా, మిగిలిన వైద్య సహాయాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ విషయంలో రవాణాకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి ఐక్యరాజ్యసమితితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.