తుగ్ల‌క్ లా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ ఏక్ నిరంజ‌న్ లా నిర్ణ‌యాలు తీసుకుంటూ తుగ్ల‌క్ లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని బండి సంజ‌య్ విమర్శించారు. ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్‌కు మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకుంటున్నాన‌ని చెబుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి ఇచ్చిన జీఓను 36 నెలల లోపట పూర్తి చేయకుండా ఫామ్ హౌస్ లో ఉండి ఉద్యోగులపై నిర్లక్ష్యం వహించారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌కు ఉద్యోగస్తుల గోస తగులుతుందని హెచ్చరించారు. దుర్మార్గమైన ఆలోచనలతో ఉద్యోగస్తుల్లో గందరగోళం సృష్టించారని దుయ్యబట్టారు.

బదిలీలు కూడా వెంటనే చేసి జాయిన్‌ కావాలని ఆదేశించడం వల్ల వారి కుటుంబం చిన్నాభిన్నమ‌వుతుందని పేర్కొన్నారు. స్థానికత ఆధారంగా 90 శాతం ఉండాలని చెప్పారు కానీ.. ఎలా చేశారో ఇంతవరకు ప్రభుత్వం చెప్పలేదని విస్మయం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న ఉద్యోగస్తుల ఇబ్బందులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

బదిలీలపై శాస్త్రీయ అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని.. లేనిపక్షంలో సీఎం స్పందించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో 370యాక్ట్‌ వచ్చినట్లు ఉందని ఆరోపించారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతనీ పక్కదారి పట్టించడానికి వరి ధాన్యం ముచ్చట తీసుకువచ్చిందని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌కు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పే రోజు వస్తుందని విమర్శించారు. రైతుల సమస్యలు లేకుండానే కావాలని ఆ విషయం తీసుకువచ్చారని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.