భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

సుక్మా, బీజాపూర్ జిల్లాలోని చిన్నచెందా అటవీప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టులు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. 
 
వివరాల్లోకి వెళ్తే.. చిన్నచెందా అటవీప్రాంతంలోని పెసర్లపాడులో మావోయిస్టులు సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ గ్రేహౌండ్స్ ఆపరేషన్ చేపట్టారు. ఆదివారం రాత్రి నుంచి మావోల కోసం జల్లెడ పట్టారు.
 
గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టులు ఒక్కసారిగా ఎదురుపడటంతో ఇద్దరి మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు దుర్మరణం చెందగా..ఎదురుకాల్పుల్లో చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతి చెందినట్లు సమాచారం. 
 
చర్లకు మండలానికి 25 కిలో మీటర్ల దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో ఈ ఉదయం 6 నుంచి ఏడున్నర గంటల మధ్య కాల్పులు జరిగాయి. మృతుల్లో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో గ్రేహౌండ్స్, మావోయిస్టులు మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.