రాష్ట్రాభివృద్ధిపై వైసీపీకి కనీస శ్రద్ధ లేదు

 

‘‘ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన నడుస్తోంది. రాష్ట్రాభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వానికి కనీస శ్రద్ధ లేదు. అభివృద్ధిలో రాష్ట్రం 30 ఏళ్లు వెనుకబడిపోయింది’’ అని బీజేపీ కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపీ సుజనా చౌదరి ధ్వజమెత్తారు. 

విశాఖపట్నం విచ్చేసిన ఆయన మాజీ ప్రధాని వాజపేయి జయంతి కార్యక్రమంలో పాల్గొంటూ వైసీపీ పాలన ఎలా ఉంటుందో స్వయంగా చూశామన్నారు. ఇప్పటికైనా మేలుకోకపోతే రాష్ట్ర ప్రజలు వలసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సినిమా థియేటర్ల యజమానులను వేధింపులకు గురిచేయడం దుర్మార్గమని విమర్శించారు. 

హాళ్లు మూతపడి, వాటిపై ఆధారపడి బతుకుతున్న వారు తీవ్ర ఇబ్బందులు చవిచూస్తున్నారని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయకపోతే ఎదురయ్యే పరిణామాలను వైసీపీ చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

విశాఖ స్టీల్‌ప్లాంటు విషయంలో కేంద్రం విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంటుందని, దీనిపై ప్రజలంతా త్వరలోనే తీపి కబురు వింటారని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ విషయమై కేంద్రాన్ని కలవడానికి జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ సిద్ధపడితే తామంతా ఆయనకు అండగా ఉంటామని చెప్పారు. విశాఖ రైల్వే జోన్‌ను కూడా తప్పకుండా ఇస్తామని స్పష్టం చేశారు.