పాలన చేతగాక ప్రజలను నట్టేట ముంచుతున్న జగన్ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన చేతగాక ప్రజలను నట్టేట ముంచుతుందని బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అంటే ఏమి చేతగాని ప్రభుత్వం అనేలా తయారైందని ఎద్దేవా చేశారు.
 
జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని జీవీఎల్ విమర్శించారు. కేంద్రం ఎన్నో పథకాలకు గ్రాంట్ల రూపంలో నిధులు ఇస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం వాటిని సరిగా సద్వినియోగం చేసుకోవడంలేదని ఆయన ఆరోపించారు.
 
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయ‌ని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను తమ సొంత పథకాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. 
 
కేంద్ర పథకాలను కూడా తన సొంత పథకాలుగా చెప్పుకుంటూ స్టిక్కర్లు వేసుకుని జగన్ తన పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈనెల 28న వియవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించ‌నున్న‌ట్లు జీవీఎల్ తెలిపారు. 
దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంద్రప్రదేశ్‌కే కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చిందని ఆయన చెప్పారు. ఆర్థిక వైఫల్యానికి కేస్ స్టడీలా ఏపీ ఉందని విమర్శించారు. ఓటీఎస్ పేరుతో జగన్ ప్రభుత్వం కొత్త తరహా దోపిడికి పాల్పడుతున్నారని ఆయ‌న ఆరోపించారు.