తోమ్మిది కంటే ఎక్కువ సిమ్‌ కార్డులుంటే ఇబ్బందులే!

ఉచితంగా సిమ్‌ కార్డ్స్‌ వస్తున్నాయని ఇష్టమొచ్చినన్నీ తీసుకొంటే ఇబ్బందులు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఒకరి పేరు మీద తొమ్మిది కన్నా ఎక్కువ సిమ్‌లు తీసుకొని ఉంటే వారు నిఘాకు గురయ్యే అవకాశం ఉంది. తాజాగా టెలికమ్యూనికేషన్‌ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఒకే పేరుతో తొమ్మిది కంటే ఎక్కువ సిమ్‌ కార్డ్స్‌ ఉన్న వారి సిమ్‌ కార్డులను రీవెరిఫికేషన్‌ చేయాలని సూచించింది. 

దీంతో అధికారులు వినియోగదారుడి పేరు మీద ఉన్న అన్ని సిమ్‌ కార్డ్స్‌ని పరిశీలిస్తారు. ఒకవేళ ఆ సిమ్‌ల్లో ఏ ఒక్కటి వెరిఫై చేయకపోయినా మిగిలిన నెంబర్లను కూడా డియాక్టివేట్‌ చేసే ప్రమాదం ఉంది. జమ్మూ కశ్మీర్‌, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో అయితే  వినియోగదారులు ఆరు సిమ్‌ల కంటే ఎక్కువ కలిగి ఉంటే వాటిని పరిశీలించాలని తెలిపింది. 

ఆరు కంటే ఎక్కువ సిమ్‌ కార్డ్స్‌ ఉన్నట్లయితే కనెక్షన్‌ కట్‌ చేయాలని సూచించింది. అయితే వినియోగదారులకు టెలికాం శాఖ ఓ అవకాశాన్ని ఇచ్చింది. ప్రస్తుతం తమకు నచ్చిందీ, వినియోగిస్తున్న సిమ్‌లను యాక్టివ్‌లో ఉంచుకుని, మిగిలిన వాటిని స్విచ్‌ ఆఫ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. 

టెలికాం ఆపరేటర్‌లను 9 కంటే ఎక్కువ సిమ్‌ కార్డ్‌లు కలిగి ఉన్న వినియోగదారులకు నోటిఫికేషన్‌ పంపాలని ఆదేశించింది. అలాంటి సిమ్‌ కార్డ్స్‌ అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ను 30 రోజుల్లోగా, ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను 45 రోజుల్లోగా నిలిపివేయాలని సూచించింది. అంతేకాకుండా వినియోగదారులు అదనపు సిమ్‌ను తమంట తాముగా డియాక్టివేట్‌ చేసుకునే అవకాశం కూడా కల్పించింది.

అయితే క్రిమినల్‌ కేసులు, ఆర్థిక నేరాల విచారణలో నేరస్థులను పట్టుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని టెలికాం శాఖ అభిప్రాయపడింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం సిమ్‌ కార్డ్‌ కెవైసి నియమాలను సవరించింది.  కొత్త సిమ్‌ తీసుకున్నాగానీ, నెంబర్‌ను మార్చుకున్నా గానీ ఎలాంటి పత్రాలను నింపాల్సిన పనిలేదని, డిజిటల్‌గా వివరాలు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.