ఆంగ్ సాన్ సూచీకి జైలు శిక్షపై భారత్ ఆందోళన 

మయన్మార్  నేత ఆంగ్ సాన్ సూకీ, మరికొందరికి జైలు శిక్షలు విదిస్తూ ఇటీవల వెలువడిన తీర్పులపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మయన్మార్‌లో చట్టబద్ధ పాలన, ప్రజాస్వామిక పక్రియలను తప్పనిసరిగా బలపరచాలని చెప్పింది. ఆ దేశంలో ప్రజాస్వామిక పరివర్తనకు మద్దతిస్తామని తెలిపింది. 
మయన్మార్‌లో ఫిబ్రవరి 1న సైనిక తిరుగుబాటు జరిగిన సంగతి తెలిసిందే. సైనిక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. వీరిపై సైన్యం విరుచుకుపడటంతో బాలలతోపాటు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 

తిరుగుబాటు చేసి, అధికారం చేజిక్కించుకున్న సైన్యం మయన్మార్ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్‌డీ) నేత ఆంగ్ సాన్ సూకీ సహా మరికొందరు నేతలను అరెస్టు చేసింది. తాజాగా మయన్మార్‌లోని ఓ కోర్టు తీర్పు చెప్తూ ఆంగ్ సాన్  నేరస్థురాలని తెలిపింది. ఆమెకు నాలుగేళ్ళ జైలు శిక్ష విదించింది. ఆ తర్వాత ఈ శిక్షను రెండేళ్ళకు తగ్గించింది. 

ఈ నేపథ్యంలో భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అదికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ  మీడియాతో మాట్లాడుతూ, మయన్మార్ కోర్టు ఇచ్చిన తాజా తీర్పులపై కలత చెందినట్లు తెలిపారు. మయన్మార్ ప్రజాస్వామికంగా పరివర్తన చెందడానికి పొరుగున ఉన్న ప్రజాస్వామిక దేశంగా భారత దేశం ఎల్లప్పుడూ సహకరిస్తుందని చెప్పారు. 

చట్టబద్ధ పాలన, ప్రజాస్వామిక ప్రక్రియలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలను అణచివేసే పరిణామాలు తీవ్ర ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. తమ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, చర్చల మార్గంలో అన్ని పక్షాలు నడుస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.