బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న

జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ మంగళవారం బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర నేతల సమక్షంలో తీన్మార్ మల్లన్న పార్టీ కండువా కప్పుకున్నారు. మల్లన్నకు తరుణ్ చుగ్ సభ్యత్వ రసీదు ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. 
 
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..‘‘నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు.. 15 మీటర్ల తాడు. ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపానికి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావును కట్టేస్తా. అమరవీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా” అని పేర్కొన్నారు. 
 
 ప్రపంచంలోనే అత్యంత మోసకారి కేసీఆర్ప్ర అంటు ప్రశ్నించే నాటికి తాను ఒక్కడినే అని, కానీ ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయని తెలిపారు. తాడు తీసుకొచ్చేందుకే తాను ఢిల్లీకి వచ్చానని చెప్పారు. ” నాపై 38 కేసులు పెట్టారు. అయినా ఏం సాధించారు?. పోలీసులు బాధపడ్డారు, జడ్జీలు మదనపడ్డారు. రాష్ట్రంలోని ఉద్యమకారులంతా ఒక్కటవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్‌పై పోరాడతాం.’’ అని ప్రకటించారు.
 
తరుణ్ చుగ్ మాట్లాడుతూ..‘‘సమస్యలపై పోరాడే నవీన్ కుమార్‌ను బీజేపీలోకి స్వాగతిస్తున్నాం. దేశంలో మార్పు రావాలంటే కలం ఎత్తాల్సిందే. కేసీఆర్ దోపిడీ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నవీన్ కుమార్ కలం ఎత్తారు. తెలంగాణా యువత తీన్మార్ మల్లన్న లైవ్ కోసం ఎదురు చూస్తుంటారు” అని చెప్పారు. 
 
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓట్లు సాధించారని గుర్తు చేస్తూ  ప్రజా సమస్యలపై బీజేపీ నేతలు యాత్రలు చేస్తుంటే అధికార పార్టీ దాడులు చేస్తూ, కేసులు పెడుతోందని ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోందని ఆయన మండిపడ్డారు.
 
తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరడం సంతోషకరమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  తెలిపారు.  తెలంగాణలో తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుక అని పేర్కొన్నారు. తెలంగాణలో రాక్షస ప్రభుత్వం, కుటుంబ పాలనను అంతం చేయాలని తీన్మార్ మల్లన్న పోరాడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ కేసులతో భయపెట్టాలని చూసిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.