బీజేపీలో చేరిన ఉద్యమకారుడు విఠల్

తెలంగాణ ఉద్యమకారుడు సిహెచ్ విఠల్  బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్సాస్ నఖ్వీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. 
 
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి.. విఠల్‌కు కండువా కప్పి, ప్రాథమిక సభ్యత్వాన్ని ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ పుష్పగుచ్చం అందించి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు.
 
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ విఠల్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ఉద్యమకారులపై సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఈ చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. 
 
తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు తెలంగాణలో బీజేపీ చేస్తున్న పోరాటానికి కలసిరావాలని ఈ సందర్భంగా సంజయ్ పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన్నకూడా  మంగళవారం బీజేపీలో చేరుతారని ఆయన తెలిపారు.
 
విఠల్ మాట్లాడుతూ ఈ రోజు జీవితంలో మరపురానిరోజని, అంబేద్కర్ జయంతి, రామమందిర నిర్మాణం కోసం కరసేవకులు బలిదానం చేసిన రోజున సొంత ఇల్లు బీజేపీకి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయడంలేదని ఆరోపించారు. 
 
టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు, మహిళలు, విద్యావంతులకు సరియైన గౌరవం లేదని ధ్వజమెత్తారు. 7 ఏళ్ళలో 600 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు. 2023లో తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తుందని విఠల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 
విద్యార్థి దశ నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ భావాలున్న ఆయన మళ్లీ రాజకీయ ప్రవేశం చేశారు. టీఆర్‌ఎస్‌ ఏర్పడక ముందు నుంచే ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకం విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని గళమెత్తారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా గతేడాది దాకా పనిచేసిన విషయం తెలిసిందే.