థానేలో ఆఫ్రికా ప్రయాణికుడితో ఒమైక్రాన్‌ కలకలం

దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు వచ్చిన ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒమైక్రాన్‌ వేరియెంట్‌ వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికా దేశం నుండి మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివిలీ ప్రాంతానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. 

అయితే అది ఒమైక్రాన్‌ వేరియంట్‌ లేదా తెలుసుకునేందుకు అతని నమూనాలను జినోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపామని, ఆ వ్యక్తిని కల్యాణ్‌ డోంబివిలి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఐసోలేషన్‌ సెంటరు (కెడిఎంసి)కి  తరలించామని ఆరోగ్య అధికారి డాక్టర్‌ ప్రతిభా పాన్‌పాటిల్‌ తెలిపారు. 

ఈ వ్యక్తి నవంబర్‌ 24న దక్షిణాఫ్రికా నుండి ఢిల్లీకి వచ్చి, ఆపై ముంబయికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంద తెలిపారు. అతని సోదరుడికి నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని, ఇతర కుటుంబసభ్యులకు కూడా సోమవారం పరీక్షలు నిర్వహిస్తామని పాటిల్‌ చెప్పారు. ప్రస్తుతం అతని కుటుంబసభ్యులను ఐసోలేషన్‌లోఉంచినట్లు తెలిపారు. 

శనివారం, బెంగళూరులో దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు ప్రయాణికులకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారికి డెల్టా స్ట్రెయిన్‌ సోకినట్లు పరీక్షల్లో తేలింది.

కాగా,  ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ఢిల్లీఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా  ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వైరస్‌ స్పైక్‌ ప్రోటీన్‌ ప్రాంతంలో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ మ్యుటేషన్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్పైక్‌ ప్రోటీన్లు దేహంలోకి వైరస్‌ ప్రవేశాన్ని సులభతరం చేస్తాయని, అలాగే ఇన్ఫెక్షన్‌ కలిగిస్తాయని వివరించారు. 

మార్పులతో రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందని హెచ్చరించారు. స్పైక్‌ ప్రోటీన్‌ శక్తిని తగ్గించేందుకు టీకాలో యాంటీబాడీలు ఉత్పత్తవుతాయని చెప్పారు. స్పైక్‌ ప్రొటీన్లలో ముట్యేషన్లు పెరిగితే టీకా సామర్థ్యం తగ్గుతుందన్న ఎయిమ్స్‌ ఛీప్‌.. ఒమిక్రాన్‌పై ప్రస్తుత వ్యాక్సిన్ల సామర్థ్యం పరిశీలించాల్సి ఉందని తెలిపారు.