రాజ్యసభలో 12 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్

పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజుననే రాజ్యసభలో 12 మంది సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు.  పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో హింసాత్మకంగా ప్రవర్తించిన 12 మంది ప్రతిపక్ష ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసే వరకు రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేశారు. 
 
ఎలమరం కరీం (సీపీఎం), ఫూలో దేవి నేతమ్ (కాంగ్రెస్‌), ఛాయా వర్మ (కాంగ్రెస్‌), రిపున్ బోరా (కాంగ్రెస్‌), బినోయ్ విశ్వం (సీపీఐ), రాజమణి పటేల్ (కాంగ్రెస్‌), డోలా సేన్ (టీఎంసీ), శాంత ఛెత్రి (టీఎంసీ), సయ్యద్ నాసిర్ హుస్సేన్ (కాంగ్రెస్‌), ప్రియాంక చతుర్వేది (శివసేన), అనిల్ దేశాయ్ (శివసేన), అఖిలేష్ ప్రసాద్ సింగ్ (కాంగ్రెస్‌) సస్పెన్షన్‌కు గురయ్యారు.

‘రాజ్యసభ 254వ సెషన్ చివరి రోజు, అంటే ఆగస్టు 11న భద్రతా సిబ్బందిపై ఉద్దేశపూర్వక దాడుల ద్వారా సభ కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తుంది. సభ సభాపతి అధికారాన్ని పూర్తిగా విస్మరించడం, సభా నియమాలను పూర్తిగా దుర్వినియోగం చేయడం, దుష్ప్రవర్తన, ధిక్కార, వికృత, హింసాత్మక ప్రవర్తన, ఉద్దేశపూర్వక దాడుల ద్వారా సభ మర్యాదను దిగజార్చడం వంటి వాటికి పాల్పడ్డారు’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

వర్షాకాల సమావేశాల చివరి రోజున వీరంతా తీవ్రంగా ప్రవర్తించారని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. సీపీఎం ఎంపీ ఎలమారం కరీం ఓ పురుష మార్షల్‌పై దాడి చేశారని, ఛాయా వర్మ, ఫులో దేవి ఓ మహిళా మార్షల్‌పై దాడి చేశారని తెలిపింది. ఈ నివేదికను రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడుకు సమర్పించింది. 

వీరికి జారీ చేసిన సస్పెన్షనల్ నోటీసులో వీరు 2021 ఆగస్టు 11న  సభ చైర్మన్ అధికారం పట్ల పూర్తిగా అగౌరవాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. పంతంపట్టి సభ కార్యకలాపాలను అడ్డుకున్నారని పేర్కొన్నారు.