మూసీ నదిని మురుగు  కాలువ అనుకున్న చీఫ్ జస్టిస్!

హైదరాబాద్ మహానగర ప్రాంత ప్రజలకు వరప్రసాదంగా మూసి నదిని చూసి మురుగుకాలువ అనుకున్నానని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ చేసిన వాఖ్యాలను చూసి కేసీఆర్ ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఎద్దేవా చేశారు. 

‘సీఎం కేసీఆర్ గారు ధనికరాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర రాజధాని… విశ్వనగరంగా ఆయన పదే పదే డబ్బా కొట్టుకునే హైదరాబాద్ నగరంలోని పురాణకాలపు మూసీనది, చారిత్రక హుస్సేన్ సాగర్ నిర్వహణ తీరుతెన్నులపై జస్టిస్ శర్మ చేసిన వాఖ్యలు  విని రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలని ఆమె ధ్వజమెత్తారు. 

హుస్సేన్ సాగర్ వద్ద వెలువడుతున్న దుర్వాసనతో 5 నిమిషాలు కూడా నిలబడలేకపోయానని, హైకోర్టు పక్కనున్న మూసీని చూసి మురుగునీటి నాలా అనుకున్నానని ఆయన అన్న మాటలు తెలంగాణ సర్కారుకు ప్రజారోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటన్నది అర్థమవుతుందని ఆమె విమర్శించారు. 

ఇది చాలక., ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ పై సండే.. ఫన్ డే పేరిట ఏదో పర్యాటకాన్ని ఉద్ధరిస్తున్నట్టు జనాన్ని రప్పించి, నాలుగు షాపులు పెట్టించి, ఆ దుర్వాసన మధ్య వారందరినీ ఆనారోగ్యం పాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 

ఇప్పటికే జంటనగరాల్లో నాలుగు చినుకులు పడితే ప్రతి ప్రాంతమూ ఒక చెరువులా మారిపోయి కనీసం వారం పాటు తేరుకునే పరిస్థితి లేదని ఆమె గుర్తు చేశారు. రాజధానిని డల్లాస్… ఇస్తాంబుల్ ఇంకేవేవో చేస్తానని, గుంత కనబడితే వెయ్యి రూపాయలిస్తామని కబుర్లకు మాత్రం కొరత లేకుండా జనాన్ని బురిడీ కొట్టించడంలో తెలంగాణ పాలకులు ఆరితేరిపోయారని విజయశాంతి దుయ్యబట్టారు. 

చీఫ్ జస్టిస్ గారు చెప్పినట్టు గుజరాత్‌లోని బీజేపీ సర్కారు అక్కడి సబర్మతీ నదిని స్వర్గతుల్యంగా మార్చిన తీరును కేసీఆర్ గారు గ్రహించాలని ఆమె హితవు చెప్పారు. అక్కడికి పీసీబీ బృందాలను పంపి అధ్యయనం చేయించాలని ఆమె సూచించారు. 

ఒకనాడు లేక్ సిటీగా దాదాపు 600 పైచిలుకు చెరువులతో అలరారిన హైదరాబాద్ నగరం నేడు నరకానికి నకలుగా మారిందన్న చీఫ్ జస్టిస్ గారి ఆవేదనను ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. తెలంగాణలోని చాలా చెరువులు ఆక్రమణలకు గురై దాదాపు కనుమరుగైన పాపంలో అధికార పార్టీ నేతల పాత్ర కూడా ఉందనడం కాదనలేని సత్యం అని విజయశాంతి పేర్కొన్నారు.